/rtv/media/media_files/2025/08/04/paints-2025-08-04-19-04-51.jpg)
Paints
మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో ఇళ్లు వేడిగా ఉంటుంది. పూర్తిగా వర్షాలు ఉండవు. దీనికి తోడు రోజంతా తీవ్రమైన ఎండ ఉండటంతో ఇళ్లు వేడిగా మారుతుంది. ఇంతటి వేడి నుంచి ఇళ్లు తట్టుకోగలడానికి సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు అద్భుతమైన ఆవిష్కరణ చేపట్టారు. మానవ శరీరంలాగే 'చెమట పట్టే' ఒక ప్రత్యేకమైన సిమెంట్ ఆధారిత పెయింట్ను అభివృద్ధి చేశారు. గాలిలోని తేమను ఉపయోగించుకుని ఈ పెయింట్ భవనాలను చల్ల బరుస్తుంది.
ఎలా పని చేస్తుందంటే..
సాధారణంగా మార్కెట్లో చాలా కూలింగ్ పెయింట్స్ ఉంటాయి. ఇవి నీటిని అడ్డుకుంటాయి. కానీ ఈ కొత్త హైటెక్ పెయింట్ అలా కాదు. దీని నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది చిన్న చిన్న రంధ్రాలతో కూడిన నిర్మాణాన్ని ఉంటుంది. దీనివల్ల వాతావరణంలోని నీటి ఆవిరిని గ్రహించి తనలో నిల్వ చేసుకుంటుంది. తర్వాత వేడి పెరిగినప్పుడు ఈ నీటిని నెమ్మదిగా ఆవిరి రూపంలో విడుదల చేస్తుంది. ఈ ఆవిరి ప్రక్రియ వల్ల వేడిని గ్రహించి, భవనం లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతుంది. దీన్నే బాష్పీభవన శీతలీకరణ అని అంటారు. ఈ పెయింట్ విద్యుత్ లేదా ఇతర యంత్రాల అవసరం లేకుండా పనిచేస్తుంది. కాబట్టి దీనిని నిష్క్రియాత్మక శీతలీకరణ అని కూడా అంటారు. మార్కెట్లో ఉన్న ఇతర కూలింగ్ పెయింట్లు సూర్యరశ్మిని ప్రతిబింబించడం ద్వారా వేడిని తగ్గిస్తాయి. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అంతగా పనిచేయవు. అందుకే ఈ కొత్త ఆవిష్కరణను తయారు చేయడానికి శాస్త్రవేత్తలు మూడు రకాల శీతలీకరణ పద్ధతులను కలిపారు. ఈ కారణంగానే ఈ పెయింట్ ఇంటిని చల్లగా ఉంచుతుంది.
మూడు పద్ధతులు ద్వారా
ఈ ప్రత్యేక పెయింట్లో మూడు పద్ధతులు కలిపి ఉంటాయి. సౌర ప్రతిబింబం, బాష్పీభవన శీతలీకరణ, రేడియేటివ్ కూలింగ్ ద్వారా కూలింగ్ వస్తుంది. సూర్యరశ్మిని తిరిగి పంపిస్తుంది. ఈ మూడు పద్ధతుల వల్ల, పెయింట్ తడిగా ఉన్నప్పటికీ, 88 నుంచి 92 శాతం సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. అలాగే గ్రహించిన వేడిలో 95 శాతం వరకు విడుదల చేస్తుంది. దీనిలో వాడిన నానోపార్టికల్స్ పెయింట్ను మరింత మన్నికగా, పగుళ్లు రాకుండా ఉండేలా చేస్తాయి. అయితే ఈ పెయింట్ను సింగపూర్లోని మూడు చిన్న ఇళ్లపై రెండేళ్ల పాటు పరీక్షించారు. ఒక ఇంటికి సాధారణ పెయింట్, రెండో ఇంటికి మార్కెట్లో లభించే కూలింగ్ పెయింట్, మూడో ఇంటికి ఈ కొత్త 'చెమట పట్టే' పెయింట్ వేశారు.
ఇళ్లపై పరీక్షించగా..
రెండు సంవత్సరాల తర్వాత మొదటి రెండు ఇళ్లపై ఉన్న పెయింట్ రంగు మారిపోయింది. కానీ ఈ కొత్త పెయింట్ రంగు మారకుండా, తెలుపు రంగులోనే ఉంది. దీనివల్ల వేడిని ప్రతిబింబించాయి. ఈ పెయింట్ వాడిన ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ కోసం విద్యుత్ వినియోగం 30 నుంచి 40 శాతం తగ్గిందని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా భవనాల్లో ఉపయోగించే విద్యుత్లో 60 శాతం శీతలీకరణకే వాడతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పెయింట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ వాడకం కూడా తగ్గుతుంది. ఇవి నగరాల్లో పెరిగే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ సమస్యను కూడా తగ్గిస్తాయి. సాధారణంగా ఎయిర్ కండిషనర్లు లోపల చల్లగా ఉంచినా, బయట వేడిని పెంచుతాయి. కానీ ఈ పెయింట్ వేడిని వాతావరణంలోకి విడుదల చేసి చుట్టుపక్కల హీట్ చేయకుండా చూస్తుంది. ఈ పెయింట్ వస్తే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.