ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు దేశాల మధ్య వివాదం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడి చేసుకుంటూనే ఉన్నాయి. దాడుల స్థాయి ప్రతిరోజూ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సంచలన కామెంట్స్ చేశారు. అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా హస్తం
అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లోగా దాడులపై నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని పేర్కొంది. అయితే, మేం వాటిని తిరస్కరిస్తున్నామని తేల్చి చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భట్టి చూస్తే ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. తాము ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు పిలుపునిచ్చారన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత కాలం ఇరాన్ ఎవరితోనూ మాట్లాడటానికి సిద్ధంగా లేదని అన్నారు.
ఇదిలావుంటే ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు ఆ దేశానికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇదే టైమ్ లో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీనిపై వైట్హౌస్ స్పందిస్తూ.. ట్రంప్ ఈ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. టెహ్రాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.