Inter Students Suicide : ఎగ్జామ్.. ఈ పదమంటే భయపడే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువే.. పరీక్షలొస్తున్నాయంటే చాలు కంటి మీద కనుకు ఉండదు. ఎగ్జామ్లో చదివిన క్వశ్చన్స్ వస్తాయె రావోనన్న టెన్షన్.. చదివింది ఎగ్జామ్ టైమ్(Exam Time) లో గుర్తొస్తుందో రాదో తెలియని పరిస్థితి.. మరోవైపు పరీక్షల్లో వచ్చే మార్కులను పరువుగా భావించే పేరెంట్స్, టీచర్లు.. ఇదంతా విద్యార్థులపై భారాన్ని మోపుతుంది. పరీక్షల్లో ఫెయిలైనా, మార్కులు తక్కువొచ్చినా జీవితం అక్కడితో ముగిసిపోతుందని పలు కాలేజీలు లేనిపోనివి విద్యార్థులకు నూరిపోస్తుంటాయి. అందుకే ప్రతీ ఏడాది ఇంటర్ ఫలితాల(Inter Results) తర్వాత తనువు చాలించే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ పెరుగుతోంది. దీనికి పూర్తి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు చేయాల్సిందేంటి? విద్యార్థుల్లో ఆలోచనలో మార్పు ఎలా తీసుకురావాలి? అటు కాలేజీలు చేస్తున్న తప్పిదాలేంటి లాంటి విషయాలను ఇవాళ తెలుసుకుందాం!
కొంతమందికి సైన్స్ సబ్జెట్ అబ్బదు.. మరికొంతమందికి మ్యాథ్స్ అర్థంకాదు.. టెన్త్ క్లాసు వరకు ఎలాగో నెట్టుకొస్తారు. తీరా ఇంటర్కు వచ్చే సమయానికైనా వారికి ఈ రెండు సబ్జెక్టుల నుంచి విముక్తి లభిస్తుందా అంటే లేదు. సోషల్ స్టడీస్లో ఎంత గ్రిప్ ఉన్నా ఎంపీసీ మాత్రమే తీసుకోవాలని పేరెంట్స్ బలవంతంగా పిల్లలను కాలేజీల్లో చేర్పిస్తారు. 'ఐఐటీ ర్యాంక్ వస్తానే లైఫూ' అని కాలేజీవాళ్లు చెప్పిన మాట మాత్రమే పేరెంట్స్కు నిత్యం వినిపిస్తుంటుంది. అందుకే వ్యక్తిగత ఇంట్రెస్టులతో సంబంధం లేకుండా ఇష్టం లేని, అర్థంకాని గ్రూపుల్లో చేరి పిల్లలు ఇంటర్ రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడతారు. అటు కార్పొరేట్ కాలేజీలు సెక్షన్ల వారీగా పిల్లలను విభజించి బోధిస్తాయి. మొదటి సెక్షన్ వారికి మంచిగా క్లాసులు చెబుతారు. మిగిలిన సెక్షన్లను పెద్దగా పట్టించుకోరు. తీరా పరీక్షలు విడుదలయ్యాక మార్కులు తక్కువ వస్తే చుట్టూ పక్కల వారి మాటలను తట్టుకోలేక, పేరెంట్స్ ఏం అంటారనే భయంతో, ఇతర కారణాలతో పిల్లలు తమ జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటున్నారు.
మార్కులను పరువుగా భావించడం పేరెంట్స్ చేసే అతి పెద్ద తప్పు. ఇలా ఆలోచించడం వల్ల విద్యార్థులపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది పరీక్షా ఫలితాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ప్రతీఏడాది ఇంటర్ ఫలితాల తర్వాత ఆత్మహత్య(Suicide) చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు పరీక్షల్లో పాస్, ఫెయిల్ లాంటి కాన్సెప్టు అవసరమా అని చర్చ కూడా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఎంత నేర్చుకుంటుమన్నది ముఖ్యం కానీ ఎంత బట్టి కొట్టామన్నది అసలు మేటరే కాకూడదు కదా.
పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే అంతా అయిపోనట్టు భావించకూడదు. జీవితంలో ఎదగడానికి, స్థిరపడడానికి అనేక దారులు ఉన్నాయి. చదువు ఒకటే ప్రతిభకు కోలమానం కాదు. ఈ విషయాలను పేరెంట్స్ చిన్నతనం నుంచి పిల్లలకు చెప్పాలి.
Also Read: Mint Leaves: పుదీనా ఆకులను లైట్ తీసుకుంటున్నారా..? అయితే శరీరంలో సమస్యలు తప్పవు..!