ఆసియాకప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మొదటి మ్యాచ్లో నేపాల్ మీద గెలిచిన పాక్ మూడు పాయింట్లతోసూపర్4కు అర్హత సాధించింది. రోహిత్ సేన ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. సెప్టెంబర్ 4న నేపాల్ జట్టుతో జరగనున్న తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపాల్ మీద గెలిస్తే భారత్ కూడా మూడు పాయింట్లతో సూపర్4 దశకు చేరుతుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు బౌండరీలతో మంచి టచ్లో కనిపించిన రోహిత్ని షాహీన్ ఆఫ్రిది క్లిన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని సాగనంపాడు. కేవలం 4 పరుగులే చేసిన కోహ్లీ షాహీన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన అయ్యార్ హారీశ్ రౌఫ్ బౌలింగ్లో ఫకర్ జమాన్కి దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్లో గిల్ బ్యాటింగ్ చాలా దారుణంగా అనిపించింది. 32 బంతులాడిన గిల్ కేవలం 10 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ మాత్రమే బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 31గా మాత్రమే రికార్డయింది.
15 ఓవర్లలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా అటాకింగ్కి దిగారు. పోటిపడి బౌండరీలు దాటడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 150 లోపే ఆలౌట్ అని అంతా భావించగా.. ఈ ఇద్దరి పార్టనర్షిప్ వల్ల 200 పరుగుల మార్క్ని దాటింది. 81 బంతుల్లో 82 పరుగులు చేసిన ఇషాన్కిషన్ని హారీస్ రౌఫ్ విడదీశాడు. దీంతో 204వ పరుగు వద్ద ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. 138పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత హార్దిక్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 90 బంతుల్లో 87 రన్స్ చేశాడు హార్దిక్.. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. రవీంద్ర జడేజాను కూడా ఆఫ్రిది పెవిలియన్ పంపాడు. 43వ ఓవర్ చివరి బంతికి అఫ్రిది వికెట్ తీశాడు. అఫ్రిది వేసిన బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతిలో పడింది. తర్వాత ఓవర్ తొలి బంతికే శార్దూల్ ఠాకూర్ (3) కూడా ఔటయ్యాడు. ఏడు బంతుల వ్యవధిలో హార్దిక్, జడేజా, శార్దూల్ ఔట్ అవ్వడంతో టీమిండియా జోరుకు బ్రేకులు పడ్డాయి.
దీంతో భారత్ జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 82 పరుగులు చేయగా.. పాండ్యా 90 బంతుల్లో 87 రన్స్ చేశాడు. అటు పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది నిప్పులు చెరిగాడు. నాలుగు వికెట్లతో టీమిండియా టాప్ లేపాడు. ఇక నసీమ్ షా, రౌఫ్ సైతం తల మూడు వికెట్లు పడగొట్టారు.
ఇది కూడా చదవండి: నువ్వు దేవుడు సామీ.. ఇరగదీశాడుగా.. పాక్ టార్గెట్ ఎంతంటే?