/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/imran-jpg.webp)
ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వివిధ కేసుల్లో కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆయనకు తాజాగా మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో.. ఇమ్రాన్ ఖాన్కు ఆయన భార్య బుష్రా బీబీకి పాక్ కోర్టు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.
ఆ రూల్ పాటించాలి
బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ ఫరీద్ దీనిపై కేసు పెట్టగా.. ఈ అంశంపై కోర్టు విచారించింది. ఇస్లాం నిబంధనల ప్రకారం భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న అనంతరం పెళ్లి చేసుకోవాలంటే కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రూల్స్ను ఆయన భార్య బుష్రా బీబీ ఉల్లంఘించారని ఆమెపై తన ఫరీద్ కేసు పెట్టారు. అంతేకాదు.. పెళ్లికి ముందు నుంచే బుష్రా, ఇమ్రాన్ ఖాన్ల మధ్య బంధం కొనసాగినట్లు ఆరోపణలు చేశారు.
తోషఖానా కేసులో ఇరుకున్న ఇమ్రాన్
దీంతో ఇమ్రాన్ దంపతులకు పాక్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే బుష్రా బీబీ 2017 నవంబర్లో ఫరీద్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్ ఖాన్ను పెళ్లి చేసుకున్నారు. ఇదిలాఉండగా ఇప్పటికే.. తోషఖానా కేసులో ఇమ్రాన్కు, బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.
అంతకుముందు కూడా రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. అయితే పాకిస్థాన్లో ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ఆయనకు ఇలా వరుసగా శిక్షలు పడటంతో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.