క్రికెట్ అభిమానులకు శుభవార్త..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త అందించింది ఐసీసీ. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పురుషుల వరల్డ్కప్ టికెట్ల అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ మ్యాచుల టికెట్స్ అమ్మకాల తేదీలను ప్రకటించింది. వార్మప్ మ్యాచ్ల దగ్గరి నుంచి, వరల్డ్ కప్ ఫైనల్ వరకు అన్ని మ్యాచుల టికెట్లను బుక్ మై షో(Bookmyshow) ద్వారా విక్రయించనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అభిమానులు ముందుగా రిజిస్టర్(https://cricketworldcup.com/register)చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఆగస్టు 25 నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని ట్వీట్ చేసింది.
ఆగస్టు 25న అమ్మకాలు ప్రారంభం..
ఆగస్టు 25: భారత్ కాకుండా ఇతర అన్ని జట్లు ఆడే వార్మప్ మ్యాచ్లు, ఇతర అన్ని జట్ల వరల్డ్ కప్ మ్యాచ్ల టికెట్ల లభ్యం
ఆగస్టు 30: గువాహటి, త్రివేండ్రం స్టేడియంలలో భారత్ ఆడే మ్యాచ్ల టికెట్ల లభ్యం
ఆగస్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణే నగరాల్లో భారత్ ఆడే మ్యాచ్ల టికెట్ల లభ్యం
సెప్టెంబర్ 1: ముంబయి, లక్నో, ధర్మశాలలో భారత్ ఆడే మ్యాచ్ల టికెట్ల లభ్యం
సెప్టెంబర్ 2: బెంగళూరు, కోల్కతాలో భారత్ ఆడే మ్యాచ్ల టికెట్ల లభ్యం
సెప్టెంబర్ 3: అహ్మదాబాద్లో భారత్ ఆడే మ్యాచ్ల టికెట్ల లభ్యం
సెప్టెంబర్ 1: వరల్డ్కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ల టికెట్ల లభ్యం
అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్..
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభంకానుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.
అయితే ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. భారత్, పాక్ మ్యాచ్ సహా మొత్తం 9 మ్యాచ్ల తేదీల్లో మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ను అక్టోబర్ 14కి మార్చారు.