ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ లో గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం పెను ప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భూకంప ధాటికి ఏకంగా 50 వేల మందికి పైగా చనిపోయారు. కోట్ల ఆస్ధి నష్టం వాటిల్లింది. భారత్ లో కూడా ఈ మద్య వరుసగా భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే..
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. జమ్మూకాశ్మిర్ లోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రికృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. భూ ప్రకంపనల తీవ్రతకు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉత్తరాధిన ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్ తో పాటు మణిపూర్ లో సైతం పది సెకన్ల పాటు భూమి కంపించింది. శ్రీనగర్ లో ఒక్కసారిగా భూమి కంపించడంతో పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు భయంతో వణికిపోయారు. క్లాస్ రూంల నుంచి బయటకు పరుగులు తీశారు. మార్కెట్ లో ఉన్న షాపు యజమానులు, ఇళ్లల్లో ఉన్నవాళ్లు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత నెలలోనూ జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇక పాకిస్థాన్లోని లాహోర్లో పరిసర ప్రాంతాల్లో సైతం భూ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.