Harirama Jogaiah: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామజోగయ్య లేఖాస్త్రం

జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయించడంపై హరిరామజోగయ్య లేఖ రాశారు. ఏ ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర జనసేనాని చేయిచాచడం ఏంటన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని పేర్కొన్నారు.

Harirama Jogaiah: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామజోగయ్య లేఖాస్త్రం
New Update

Harirama Jogaiah Letter on TDP-Janasena First List: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామజోగయ్య లేఖ రాశారు. జనసేనకు 24 అసెంబ్లీ (Janasena 24 Seats), 3 ఎంపీ సీట్ల కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu) దగ్గర పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) చేయిచాచడం ఏంటని అన్నారు.  బాబుకు పవన్‌ ఎందుకు వంతపాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే జనసేనాని పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా (Pawan As CM) ఉండాలని లేఖలో పేర్కొన్నారు. ఇరు పార్టీలకు చెరో సగం మంత్రి పదవులు దక్కాలని డిమాండ్ చేశారు.

లేఖలో ఎమన్నారంటే?

'తెలుగుదేశం, జనసేన రాబోయే ఎన్నికలలో 175 సీట్లలో ఎవరెవరు ఎన్నెన్ని సీట్లలో పోటీ పెట్టదలచినారో సుముహూర్త ఘడియలలో ప్రకటించటం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 175 సీట్లలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు కేటాయించినట్లు, తెలుగుదేశం ప్రస్తుతం 94 సీట్లలో అభ్యర్ధులను ప్రకటిస్తున్నట్లు, మిగిలిన 57 సీట్లు బి.జె.పి కూడ తమ కూటమితో కలిసి ప్రయాణించటానికి సిద్ధమైతే వారికి యివ్వవలసిన సీట్లు పోను మిగిలియున్న సీట్లలో పోటీ పెట్టవలసియున్న అభ్యర్ధుల పేర్లను తెలుగుదేశం (TDP) త్వరలో ప్రకటించగలము అంటూ ప్రకటన చేశారు.

పొత్తు ధర్మం ఇదేనా?

పంపకం జరిగిన 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కాపులకు 15 సీట్లు, బి.సి.లకు 25 సీట్లు లభ్యమయ్యాయి. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా దక్కవలసియున్న సీట్లు బి.సి.లకు 50 శాతం, కాపులకు 25 శాతం, కమ్మ వారికి 4 శాతం, రెడ్లకు 6 శాతం సీట్లు. ఈ సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదిక మీద చేశారు? సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన జరిగినయా? సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించినట్లు చేసిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు జన సైనికుల సంతృప్తి మీద జరిగినాయా? జన సైనికుల గౌరవానికి తగ్గట్లు జరిగినాయా? అయినా ఒకరు యివ్వటం, మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా? అని ప్రశ్నించారు.

Also Read: మేడారం జాతరలో బీట్‌ ఆఫీసర్‌పై ఎస్పీ దురుసు ప్రవర్తన

జనసేన చేయిచాచడం ఏంటి?

అసలు ఈ సీట్ల పంపకం తెలుగుదేశం యివ్వటం, చేయి జాచి జనసేన తీసుకోవటం ఏమిటి? జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజలలో అంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? నిజానికి ఆర్ధికంగా బలమైనవారు ఉండి, జనసేనకు సామాజికపరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60గా గుర్తింపబడిన మాట వాస్తవం. ఆయా నియోజకవర్గాల వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడ ప్రకటించటం జరిగింది.

సంతృప్తిపరచ లేదు

అయినా ఈ కేటాయింపు బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 నియోకవర్గాలను ఎంపిక చేయటం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గార్కి వంత పాడటం ఎందుకో వంత పట్టటం లేదు. జనసేనక శక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారో తెలియటం లేదు. అధికార పక్షాలు విమర్శలకు ఎటువంటి సాక్ష్యాలతో కూడిన ఆధారాలు లేవనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ 24 నియోజకవర్గాలు కేటాయింపు అధిక సంఖ్యాకులైన జన సైనికులను సంతృప్తిపరచని మాట వాస్తవం. వారు కోరుకుంటున్నది రాజ్యాధికారంలో తమకు గౌరవమైన వాటా. అదీ సీట్ల పంపకంలో జరిగినప్పుడే పరిపాలనాధికారం కూడ దక్కుతుందనేది వారి వాదన.

Also Read: రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్‌..సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం..!

కనీసం రెండున్నరేళ్లు..

తాము కలలు కంటున్నట్లుగా పొత్తులో భాగంగానైనా తమ అధినేత పవన్ కల్యాణ్ కనీసం 2 1/2 సం॥రాలు ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి కోరిక. తక్కువ సంఖ్యలో జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా ముందు ముందు తమకు అధికారంలో రావాల్సిన వాటా రాకుండా పోతుందేమోనన్నది వారి ఆవేదన. అధికారం చేజిక్కించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కలలుగంటున్న రామ రాజ్యం స్థాపించుకోలేమన్నది వారికున్న భయం. పవన్ కళ్యాణ్ లేకుండా తమందరూ కోరుకుంటున్న నీతివంతమైన పరిపాలన సాగదేమోననేది వారి ఆందోళన.

చెరిసగం పదవులు దక్కాలి

వై.ఎస్.ఆర్ పార్టీ దుష్ పరిపాలనకు అంతం పలకాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేర్చటానికి జన సైనికులు ఎల్లప్పుడూ సిద్ధమే. జనసేన ఓట్లు సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం నెగ్గలేదనేది 2019 లెక్కలు చెబుతున్నాయి. అయినా జన సైనికులను సంతృప్తి పరచకుండా వై.ఎస్.ఆర్ పార్టీని ఎలా ఓడించగల్గుతామని కూటమి నాయకులు నమ్ముతున్నారో తెలియటం లేదు. జన సైనికులకు కావల్సింది కేవలం ఎన్ని ఎమ్.ఎల్.ఏ పదవులు దక్కించుకొన్నామని కాదు, పవన్ కళ్యాణ్ పరిపాలనాధికారం చేబట్టటం. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గార్కి 2 1/2 సం॥రాలైన ముఖ్యమంత్రి పదవి దక్కాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఈ పదవులు అన్నీ చెరిసగం పంచుకోదలిచామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుగారి నోటి వెంట స్వయంగా ప్రకటింపచేయాలి. సీట్లు ఎన్ని కేటాయించారనే ప్రసక్తి లేకుండా ఈ రకమైన ప్రకటన విడుదల అయితే జన సైనికులందరూ సంతృప్తి పడే అవకాశం ఉంది'. అంటూ లేఖలో పేర్కొన్నారు.

#janasena-chief-pawan-kalyan #harirama-jogaiah #tdp-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe