యూట్యూబ్ ట్రెండింగ్లో గ్లింప్స్..
యువ నటుడు విశ్వక్సేన్ 11వ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ సినిమాకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే పేరును ఖరారుచేశారు. ఇప్పటివరకు తెలంగాణ యాస, భాషలో ఎక్కువగా నటించిన విశ్వక్ ఈ మూవీలో తొలిసారిగా గోదావరి యాసలో మాట్లాడుతూ రఫ్ అండ్ మాస్ లుక్లో అదరగొట్టాడు. గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా గోదావరి నేపథ్యంలో సాగే పొలిటికల్ మాస్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. 'మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం' అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ కుర్రాడు అయిన విశ్వక్ ఇలా గోదావరిపై సినిమా, అది కూడా మాస్ యాక్షన్ మూవీ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్' యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది.
కీలకపాత్రలో నటి అంజలి..
సితార సంస్థ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీతో పాటు విశ్వక్ కూడా నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. అలాగే సాయి కుమార్, నాజర్, గోపరాజు రమణ సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం ఇస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య ఇంతకు ముందు నారా రోహిత్తో 'రౌడీ ఫెలో' అనే చిత్రం డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నితిన్తో 'ఛల్ మోహన్ రంగా' తీశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
వరుస సినిమాల జోరు..
వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఇటీవలే తన కెరీర్లో 10వ సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న 'ధమ్కీ' సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ.8కోట్లతో తీసిన ఈ సినిమాకు దాదాపు రూ. 2.50కోట్ల మేర లాభాలు వచ్చాయి. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు విశ్వక్సేన్ దర్శకత్వం వహించడం విశేషం.