చీరాలలో వేడెక్కిన రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్: బాపట్ల జిల్లా చీరాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కేడర్ మధ్య ఘర్షణ జరిగింది. దీనంతటికీ కారణం సోషల్ మీడియాలో వారు చేసుకున్న పరస్పర విమర్శలే. అవి కాస్తా రోడ్డెక్కాయి. రెండు వర్గాల వారూ పేరాల కూడలికి చేరుకొని.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టేసుకున్నారు. ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్ సత్యానందంకు గాయాలవ్వడంతో ఆయనను చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఒకరిపై ఒకరు దాడి..
31వ వార్దు కౌన్సిలర్ సళ్ళూరి సత్యానందంని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో.. రెండు వర్గాల వారూ... పేరాల కూడలి నుంచి ఆస్పత్రికి చేరుకున్నారు. మళ్లీ అక్కడ కూడా దాడులు చేసుకున్నారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి రెండు వైపుల వారినీ చెదరగొట్టారు. అప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాలేదు. దాంతో పోలీసులు కేసులు రాశారు. అసలు ఈ తాజా వివాదానికి కారణమేంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా... ఏ క్షణాన ఏమవుతుందో అనే ఉద్దేశంతో పోలీసులు అక్కడే ఉండి అంతా బందోబస్తు కొనసాగిస్తున్నారు.