Election Rules: ఎలక్షన్స్ సమయంలో జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఎందుకు పెరుగుతాయి? 

ఎలక్షన్స్ వస్తే జిల్లా కలెక్టర్ల అధికారాలు పెరుగుతాయి. మన రాజ్యరంగంలోని ఆర్టికల్ 324లోని 6వ అధికరణ ద్వారా ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని పొందుతుంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ సజావుగాజరిపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేశారు.

New Update
Election Rules: ఎలక్షన్స్ సమయంలో జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఎందుకు పెరుగుతాయి? 

Election Rules: ఎప్పుడూ మనకు రాజకీయ నేతలు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. వీళ్ళ హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువగా రాజకీయ నాయకుల సందడే ఉంటుంది. కలెక్టర్లు.. ఇతర అధికారులు నేతలను ఫాలో అవుతున్న పరిస్థితే ఉంటుంది. కానీ..ఎన్నికల సమయంలో మాత్రం జిల్లా కలెక్టర్లకు అపరిమిత అధికారాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కలెక్టర్ కి ఇంత అధికారం ఉంటుందా అని ఒక్కోసందర్భంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది సామాన్యులకు. ఎందుకంటే, నిత్యం రాజకీయ నాయకుల వెనుక.. లేదా కార్యాలయాల్లో కూచుని తమ పనులను నిర్వహించే జిల్లా స్థాయి అధికారులు.. ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా సూపర్ యాక్టివ్ గా మారిపోతారు. ఎంతలా అంటే.. ఏ పార్టీ అభ్యర్థి లేదా నేత లేదా నాయకుడు ప్రతి చిన్న మార్పుకోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా స్థాయి అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా ఎందుకు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహానికి సమాధానం అర్ధం చేసుకుందాం. 

మన ప్రజాస్వామ్యంలో ప్రతీదీ రాజ్యాంగ బద్ధంగా జరుగుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే.. అధికారుల అధికారాలు.. వాటి పరిమితులు ఉంటాయి. మిగిలిన సమయంలో మాట ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో(Election Rules) మాత్రం కచ్చితంగా రాజ్యాంగ బద్ధంగా అధికారులు వ్యవహరించాల్సిందే. ఈ సమయంలో అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ఎటువంటి ప్రక్రియలోనూ రాష్ట్ర ప్రభుత్వ జోక్యం కుదరదు. ఎటువంటి రాజకీయ పలుకుబడి ఉపయోగపడదు. ఎన్నికల ప్రక్రియలో పరిపాలనా వైవాస్త అధికారం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి ఎలా వస్తుందో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. 

ఎన్నికల్లో డీఎం/కలెక్టర్ల అధికారాలు ఎలా పెరుగుతాయి

ఎన్నికల సమయంలో వారి అధికారం ఎలా, ఎందుకు పెరుగుతుందో తెలియాలంటే, మనం అందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ను అర్థం చేసుకోవాలి.  ఈ ఆర్టికల్ ప్రకారం దేశంలో అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్ సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో దీని ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఎన్నికల సంఘానికి సొంతంగా పెద్ద పరిపాలనా వ్యవస్థ లేనందున, ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను పొందడానికి వీలుగా రాజ్యాంగంలోనే ఇటువంటి వ్యవస్థను సృష్టించారు.

ఆర్టికల్ 324లోని 6వ అధికరణ ప్రకారం ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా, దానికి సంబంధించిన అవసరాల కోసం ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తుంది. ఈ విధంగా ఎన్నికల సమయంలో రాష్ట్ర లేదా కేంద్రం పరిపాలనా వ్యవస్థల విషయంలో ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది.

Also Read: ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు

మామూలు మాటల్లో దీనిని  చెప్పాలంటే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే రాష్ట్ర, దేశ పరిపాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘానికి నియంత్రణ లభిస్తుంది. దీన్ని మీరు ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికారిని నియమించడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల అధికారాలు కూడా పెరుగుతాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి(Election Rules) అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లా డీఎం లేదా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అవుతారు. దీనితో పాటు వారి అధికారం, హక్కులు కూడా పెరుగుతాయి.

అధికారులకు ఇది ఎంతటి శక్తినిస్తుందంటే.. 

జిల్లాలో ఎలాంటి వివక్ష లేకుండా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ జిల్లా ఎన్నికల అధికారులపై ఉంది. ఎన్నికల్లో వారి బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి జిల్లా ఎస్డీఎంను రిటర్నింగ్ అధికారిగా నియమించి ఆ బాధ్యతను నెరవేరుస్తారు. రాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థులు ఏ నామినేషన్లు వేసినా ఎస్డీఎం అంటే రిటర్నింగ్ అధికారి ద్వారా చేస్తారు.

వ్యవస్థను ఎక్కువగా విశ్వసించే లేదా ఎలాంటి వివాదాలు లేని అధికారులే ఎన్నికలను నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సమీక్షించి ఒక అధికారిని బదిలీ చేయాలని లేదా వేరే చోట నియమించాలని భావిస్తే ప్రభుత్వానికి ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని పాటిస్తుంది. 

ఇప్పుడు డీఎం అంటే జిల్లా ఎన్నికల అధికారి పవర్ గురించి మాట్లాడుకుందాం. జిల్లాలో ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంతో ఇది ప్రారంభమవుతుంది. సాధారణంగా వ్యవస్థపై నాయకుల ప్రభావం కనిపిస్తుంది కానీ ఎన్నికల సమయంలో కోడ్ అమల్లోకి రావడంతో అలా జరగదు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగానూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. నియంత్రణ అంతా ఎన్నికల సంఘానికి వెళ్తుంది. జిల్లాలో ఏం జరుగుతుందో, ఏం జరగకూడదో జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు.

ఎవరైనా అభ్యర్థి ర్యాలీ నిర్వహించాలి.. దాని కోసం  ఎలాంటి అనుమతి తీసుకోవాలి అనేది ఆ సమయంలో జిల్లా ఎన్నికల(Election Rules) అధికారి నిర్ణయిస్తారు. ప్రతి చిన్న అనుమతి కోసం అభ్యర్థి లేదా ఆయన ప్రతినిధి జిల్లా ఎన్నికల అధికారి వద్దకు వెళ్లాల్సిందే.  ఒకవేళ అభ్యర్థి అడిగిన అనుమతి అసమంజసంగా అనిపిస్తే  దానిని కలెక్టర్లు నియమించిన రిటర్నింగ్ అధికారి తిరస్కరించవచ్చు. అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి, ర్యాలీ ఎలా నిర్వహించాలి, ఏం చేయగలడు, ఏం చేయలేడు అనే విషయాలను నిర్ణయించే బాధ్యత కూడా వారిదే. అభ్యర్థి లేదా అతని ప్రతినిధి ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రాని పనులు చేస్తే వారు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. ఓటింగ్ నుంచి కౌంటింగ్ వరకు, తదుపరి ప్రభుత్వ ప్రకటన వరకు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారాలు అపరిమితంగా ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న మన ఎన్నికల వ్యవస్థకు ఈ ఆర్టికల్ 324 ద్వారా అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ వెన్నుదన్నుగా నిలుస్తోంది అనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలో ఈ అధికారులు తీసుకునే నిర్ణయాలు.. ఎదుర్కునే సవాళ్లు.. లెక్కలేనన్నిగా ఉంటాయి. అన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా.. ప్రజలకు భరోసాను ఇస్తూ వస్తోంది మన ఎన్నికల అధికార వ్యవస్థ.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు