జెడ్పీ చైర్పర్సన్పై అసంతృప్తి
కొన్నేళ్లుగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయపై అసంతృప్తితో ఉన్న జెడ్పీటీసీలు సమావేశమయ్యారు. జెడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు ఒకచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు జెడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించినట్లు తెలిసింది. అసంతృప్తితో ఉన్న వారంతా 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మాన నోటీసులు
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చెందిన కనమల్ల విజయ జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతుండటం. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జెడ్పీటీసీలు సమావేశమై అవిశ్వాసం ప్రతిపాదన తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీలో సుమారు 12 మంది జెడ్పీటీసీలు, వారి భర్తలు పాల్గొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం జెడ్పీలో 16 మంది జెడ్పీటీసీలున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస నోటీసుకు సంబందించిన కార్యాచరణ చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
పదవీ కాలం పూర్తయ్యేకే అవిశ్వాసం
రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత జరిగిన తొలి జెడ్పీటీసీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పరిషత్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. కొత్తగా ఏర్పాటైన ఇల్లందకుంట మండలంతో పాటు, చొప్పదండి జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి 16 జెడ్పీటీసీ స్థానాలు గెలవడంతో ఇల్లందకుంట నుంచి గెలిచిన కనమల్ల విజయను జెడ్పీ చైర్పర్సన్ స్థానం వరించింది. తాజాగా అవిశ్వాసం ప్రతిపాదించి, సమావేశంలో నెగ్గి, చైర్పర్సన్ స్థానం ఖాళీ అయితే ఆ స్థానం చొప్పదండి జెడ్పీటీసీని మాత్రమే వరించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి చొప్పదండి జెడ్పీటీసీ మాచర్ల సౌజన్యపై పడింది. పైగా చొప్పదండి మండలంలోనే జెడ్పీటీసీల భేటీ జరుగడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయ్యేకే అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉండటం, జెడ్పీటీసీలు ప్రత్యేకంగా బేటీ కావడం చర్చనీయాంశమైంది.