వివిధ కోణాల్లో దర్యాప్తు..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ రామ్ప్రసాద్ మృతిపై ఇంకా అనుమానాలు వీడలేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రులో ఈ నెల 24న శ్యామ్ ఉరివేసుకుని మృతి చెంది ఉండటం వెలుగుచూసిన విషయం తెలిసిందే. చేతిపై బ్లేడుతో గాయాలు ఉండటం, ఆత్మహత్యకు ముందు శ్యామ్ మాట్లాడినట్లుగా ఉన్న సెల్ఫీ వీడియోలో మరోవ్యక్తి మాటలు కూడా వినిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
న్యాయం కావాలి..
శ్యామ్ చనిపోయే ముందు 24న ఫోన్లో ఎవరెవరితో మాట్లాడాడనే వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఏవైనా సందేశాలు పంపాడా అని ఆరా తీస్తున్నారు. మోడేకుర్రుతో పాటు స్వగ్రామమైన కొప్పిగుంట, ఇతర ప్రాంతాల్లో విభేదాలు ఉన్నాయా?.. ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన రాసుకున్న పలు కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. శ్యామ్ మృతిపై తల్లిదండ్రులు, సోదరి కొత్తపేట డీఎస్పీ రమణకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
మా అన్న పిరికివాడు కాదు..
నా కొడుకుది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ కొత్తపేట డీఎస్పీ వెంకటరమణకు శ్యామ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారని మా అన్నయ్య ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని శ్యామ్ చెల్లి పద్మిని Rtvతో చెప్పింది. అయితే సెల్ఫీ వీడియోపైన పలు అనుమానాలు ఉన్నాయని, సెల్ఫీ వీడియోలో మొదటి మాట్లాడిన వీడియోకి లాస్ట్ వీడియోకి తేడా ఉందన్నారు. సెల్ఫీ వీడియోలో మరొకరు మాట్లాడిన మాటలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు కుటుంబీకులు. సెల్ఫీ వీడియో చనిపోయిన వెంటనే బయటకు రాలేదని, ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పినప్పుడు ఈ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిందని పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కొత్తపేట డీఎస్పీ వెంకటరమణకు టీడీపీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు.
ఘటనపై చంద్రబాబు ఆరా
శ్యామ్ కుటుంబీకులను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. శ్యామ్ మణికంఠ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. జరిగిన ఘటనపై అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలతో కలిసి డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని శ్యామ్ తల్లిదండ్రులు తెలిపారు. మృతుడి కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల మీ కుటుంబానికి అండగా ఉంటుందని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.