CWC Meeting: తెలంగాణ కాంగ్రెస్లో జోష్ మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా నగరానికి తరలివస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర అగ్రనేతలు మరికాసేపట్లో భాగ్యనగరానికి చేరుకోనున్నారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటున్న నేతలకు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు టీపీసీసీ కార్యకర్తలు. కాంగ్రెస్ అగ్రనేతల రాకతో పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతోపాటు సీఐఎస్ఎఫ్ జవాన్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నేతలు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు.
This browser does not support the video element.
హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న సమావేశాల కోసం టీపీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ పునర్వైభవం కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీడబ్యూసీ సమావేశం అనంతరం తుక్కుగూడలో రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ వేదిక నుంచే ఆరు గ్యారంటీ ఎన్నికల హామీలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. సుమారు 10 లక్షల మంది సభకు రానున్నట్లు తెలుస్తోంది. అటు హోటల్ తాజ్ కృష్ణ వద్ద ఎమ్మెల్యే సీతక్క డప్పు కళాకారులతో డ్యాన్స్ వేసి సందడి చేశారు.
ఇటీవలే మొత్తం 84 మందితో CWC పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది.. ఇంఛార్జ్లుగా 14 మంది.. ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మంది.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా నలుగురు నియామకం అయ్యారు. శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలట్, దీప్ దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సెన్లకు స్థానం దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి జనరల్ సభ్యుల జాబితాలో రఘువీరారెడ్డికి మాత్రమే చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహ.. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డి జాబితాలో ఉన్నారు.