ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడంపై యాంటి టెర్రరిజం ఫోరం(ATF) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

New Update
ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి కారణం అదేనా? వైద్యులు ఏం చెప్పారంటే!!

Controversy over folk singer Gaddar's funeral: 

నక్సలిజం వైపు మళ్లించిన వ్యక్తి.. 

ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్ రావు(గద్దర్) అంత్యక్రియను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్ణయించడం నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమే అని యాంటి టెర్రరిజం ఫోరం(ATF)ఆగ్రహం వ్యక్తంచేసింది. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని ATF కన్వీనర్ రావినూతల శశిధర్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందన్నారు.

పోలీసుల అమరులను అవమానించడమే..

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య, శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులు, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు. పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన వెల్లడించారు. సర్కార్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.

నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్..

పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని పేర్కొన్నారు. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పాలని సూచించారు. దీనిని ఓ వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని.. మావోయిజం భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని శశిధర్ డిమాండ్ చేశారు.

తూఫ్రాన్ పట్టణంలో విషాదఛాయలు..

మరోవైపు గద్దర్ మృతితో తన సొంత స్వగ్రామం మెదక్ జిల్లా తూప్రాన్ (Medak - Tupran) పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ పట్టణంలో గద్దర్ మృతికి సంతాపంగా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. తెలంగాణ ఉద్యమకారులు, గాయకులు, కళాకారులు తూప్రాన్లో ర్యాలీ నిర్వహించి గద్దర్‌కు నివాళులర్పించారు. ఉదయం నుంచే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.

ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ఉంటుంది. అల్వాల్‌లో గద్దర్‌ స్థాపించిన స్కూల్‌లోనే అంత్యక్రియలు జరగనున్నాయి. సికింద్రాబాద్ నుంచి అల్వాల్ మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది. ఇక ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Also Read: పాకిస్తాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. 30 మంది దుర్మరణం

Advertisment
తాజా కథనాలు