Srinagar: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ ఎన్ఐటీ (Srinagar NIT)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల విద్యార్థుల ఆందోళనతో పరిస్థితి చేయిదాటే ప్రమాదముందని భావించిన ఎన్ఐటీ యంత్రాంగం విద్యార్థులతో హాస్టళ్లు ఖాళీ చేయిస్తోంది. దీంతో అక్కడ చదువుకుంటున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్దే ఆధిక్యం.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లెక్కలివే..!
మతపరమైన ఒక అంశంపై సోషల్ మీడియా (Social Media)లో చేసిన పోస్టులకు సంబంధించి విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర ఉధ్రిక్తత నెలకొన్న దృష్ట్యా భద్రత కారణాల వల్లే హాస్టళ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, డిసెంబరు 20లోగానే పరీక్షలు ఉన్నప్పటికీ ఎన్ఐటీ యంత్రాంగం ఈ విధంగా వ్యవహరించడంపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని పెట్టారంటే
మరోవైపు ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయమంటే తాము ఎక్కడికెళ్లాలంటూ విద్యార్థులు నిలదీస్తున్నారు. శ్రీనగర్ ఎన్ఐటీలో దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు (Telugu students) చదువుకుంటున్నారు. వారంతా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ఉన్నపలంగా ఖాళీ చేసి రావడానికి విమానాలు, రైలు సదుపాయం కూడా లేవని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్నారు.