తాగు-సాగు అవసరాలపై చర్చ
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాలు, పరిస్థితులపై సీఎం ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు.. సీఎం మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు
అయితే గోదావరి పరిధిలోని ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం, తాగు, సాగు నీటి అవసరాలు తదితరాలపై పూర్తిస్థాయిలో సీఎం సమీక్షించనున్నారు. వర్షాలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు, పరిస్థితులపై కూడా చర్చిస్తారు. ఆయా జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని తాగు, సాగు నీటి అవసరాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అంచనాల మేరకు జులై మొదటి వారం వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలే దానిపై కూడా సీఎం అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రైతుల్ని- వ్యవసాయాన్ని కాపాడుకోవడమే గోల్
సీఎం ఈ ఏడాది రైతులందరూ ముందస్తు సాగు వైపు మొగ్గు చూపాలని పిలుపిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా జరిగే ఆవశ్యకతను వివరించిన సీఎం… వ్యవసాయ శాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. ఈ క్రమంలో రైతులు ఇప్పటికే పంట పొలాలు సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ నెల నిరాశపర్చింది. గత నెలలో 131.4 మిల్లీమీటర్లకు గాను 65.2 మిల్లీమీటర్లే వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అతి తక్కువగా కురిసింది. గత నెలలో 96 శాతం సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేయగా, ఎల్నినో ప్రభావంతో పరిస్థితులు అనుకూలించలేదు. జూన్ 12లోగా రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉండగా 21వతేదీకి గానీ రాలేదు. అందరి ఆశలూ జులైపైనే ఉన్నాయి. ఈనెలలో సాధారణ వర్షపాతం 96 శాతం నమోదవ్వచ్చన్నది వాతావరణశాఖ అంచనా.
[vuukle]