ఢిల్లీ పెద్దలతో చర్చలు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపుగా 45 నిమిషాల పాటు జరిగింది. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగినట్లుగా సమాచారం. తర్వాత ప్రధానితో జగన్ సమావేశం కానున్నారు. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం సీఎం ఉదయమే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు మిధున్రెడ్డి, విజయసాయిరెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయ్రెడ్డి, ఎస్ఎస్ రావత్లు, చిదానందరెడ్డి ఉన్నారు. అమిత్ షాతో భేటీకి మాత్రం సీఎం జగన్ ఒక్కరే వెళ్లారు.
ముందస్తుకు వెళ్లాలని..!
పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళ్లే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లుగా జగన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల సంక్షేమ పథకాల అంశం పక్కకు పోతుందని అనుకుంటున్నారు. అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. వచ్చే ఏడాది మార్చి , ఏప్రిల్లో పోలింగ్ జరిగితే… ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే సూచనలు కనిపిస్తూండటంతో మరింత ఇబ్బందికరం అవుతుందని అందుకే ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై కేంద్ర పెద్దల్ని ఒప్పించేందుకే ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం నడుస్తోంది.
త్వరలో అసెంబ్లీని రద్దు
అందుకే ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. 6 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ విషయంలో సీఎం జగన్కి కేంద్రం మద్దతు లభిస్తోందని అనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానికి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటున్నారు కాబట్టి మరోసారి మోదీని కలిసి చెప్పేందుకు వెళ్లారని తెలుస్తోంది.
కేబినెట్లో క్లారిటీ వచ్చే అవకాశం
మరి ఆంధ్రపదేశ్లో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఈసీ అధికారుల్ని జగన్ సంప్రదించారని జనసేన చీఫ్ కూడా ఇటీవల ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పట్నుంచో తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇక అసెంబ్లీ రద్దు కోసం నిర్ణయం తీసుకుంటే.. డిసెంబర్లోనే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయి. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేబినెట్ భేటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ భేటీలో ముందస్తు ఎన్నికలు ఉంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[vuukle]