/rtv/media/media_files/2026/01/10/rajasaab-new-scenes-2026-01-10-15-22-15.jpg)
Rajasaab New Scenes
Rajasaab New Scenes: ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి చర్చ నడుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.112 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్రబృందం బ్లాక్బస్టర్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్దికుమార్ పాల్గొన్నారు. ఈ వేదికపై దర్శకుడు మారుతి సినిమా గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రభాస్ అభిమానులకు మరింత ఆనందం కలిగించేలా సినిమాలో కొత్తగా ఎనిమిది నిమిషాల సన్నివేశాలను జోడిస్తున్నామని మారుతి తెలిపారు. అందులో ముఖ్యంగా చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ ఉంటాయని చెప్పారు. టీజర్, పోస్టర్స్లో చూపించిన ఆ లుక్ సినిమా లో కనిపించకపోవడంతో కొంతమంది అభిమానులు నిరాశ చెందారని, వారి కోసమే ఈ కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నామని వివరించారు. ఈ కొత్త సీన్స్కు సెన్సార్ కూడా పూర్తయ్యిందని, ఈరోజు సాయంత్రం నుంచి థియేటర్లలో ప్రేక్షకులు చూడవచ్చని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో షోలు సరిగా పడకపోవడంతో ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగాయని, అందుకు క్షమాపణలు చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తాను ఒక మిడ్ రేంజ్ దర్శకుడినైనా, ప్రభాస్ తనపై నమ్మకం పెట్టి ఈ సినిమా చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు ప్రయత్నించానని చెప్పారు.
సినిమాలో క్లైమాక్స్ భాగం మైండ్ గేమ్లా ఉంటుందని, ముఖ్యంగా చివరి 40 నిమిషాలు చాలా మందికి నచ్చిందని తెలిపారు. ఇలాంటి నేపథ్యంతో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్పై సినిమా రాలేదని కొందరు ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రభాస్ కావాలంటే సింపుల్ కమర్షియల్ సినిమా చేయవచ్చని, కానీ కొత్త కథలను, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ సినిమా చేశారని చెప్పారు. అందుకే ఈ మూవీ సామాన్య ప్రేక్షకులకు కూడా చేరిందని అభిప్రాయపడ్డారు.
సినిమా ఫలితాన్ని ఒక్క షో లేదా ఒక్క రోజులోనే నిర్ణయించకూడదని మారుతి కోరారు. కనీసం పది రోజులు ఆగితే సినిమా స్థాయి ఏంటో తెలుస్తుందని అన్నారు. సినిమాలోని కొత్త అంశాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. కొంతమంది అర్థం కాక విమర్శలు చేస్తున్నారని, కానీ ఓపికగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు హిట్ కావాలని తాను కోరుకుంటున్నానని మారుతి తెలిపారు. సినిమా ఫలితం గురించి తాను బాధపడుతున్నానని అనుకుని చాలా మంది ఫోన్ చేశారని, కానీ తాను చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. అభిమానులకు ముందుగానే ప్రభాస్ ఓల్డ్ గెటప్ను తీసుకొస్తున్నామని చెప్పారు. తనకు ధైర్యం ఇచ్చిన ప్రతి స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని కూడా వెల్లడించారు.
Follow Us