సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు. హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతోఉందన్నారు విష్ణు. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నితమైన విషయాలపై 'మా' సభ్యులు స్పందించొద్దని ఆయన కోరారు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదన్నారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మా' సభ్యులకు ఐక్యత అవసరం అన్నారు. ఈ మేరకు విష్ణు ప్రకటన విడుదల చేశారు.