Modi On Caste Census: కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.. కుల గణన నివేదిక తర్వాత మోదీ వ్యాఖ్యలు!

బీహార్‌ కుల గణన నివేదిక రాజకీయంగా పెద్ద రచ్చ లేపుతోంది. తమ రాష్ట్రంలో కులాల లెక్కలను నితీశ్‌ సర్కార్‌ బహిర్గతం చేసింది. కులాల ప్రతిపాదికన జనాభా గణన జరగాలని కాంగ్రెస్‌ సహా అనేక యాంటీ బీజేపీ పార్టీలు పట్టుపడుతున్న వేళ ఈ నివేదిక రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కులం పేరిట దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Modi On Caste Census: కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.. కుల గణన నివేదిక తర్వాత మోదీ వ్యాఖ్యలు!
New Update

కులం పేరుతో దేశాన్ని విడదీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్ ప్రభుత్వం వివాదాస్పద కుల ఆధారిత జనాభా గణనను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని తన ప్రసంగంలో సర్వే గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పేదల మనోభావాలతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని ఆరోపించారు. 'అప్పట్లో పేదల భావోద్వేగాలతో ఆడుకున్నారు. ఈ రోజు కూడా వారు అదే ఆటను ఆడుతున్నారు. గతంలో కులం పేరుతో దేశాన్ని విడగొట్టారని... ఈ రోజు వారు అదే పాపం చేస్తున్నారు. గతంలో వారు అవినీతికి పాల్పడ్డారని... ఈ రోజు వారు మరింత అవినీతిపరులు" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

నివేదిక విడుదల:

బీహార్ ప్రభుత్వం సోమవారం కుల సర్వే నివేదికను విడుదల చేసింది. బీహార్‌లో వెనుకబడిన తరగతులు జనాభాలో 27.13 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతులు 36.01 శాతం ఉన్నాయి. బీహార్ మొత్తం జనాభాలో జనరల్ కేటగిరీ వారు 15.52శాతం ఉన్నారు. బీహార్‌లో షెడ్యూల్డ్ కులాలు 19.7శాతం, షెడ్యూల్డ్ తెగలు 1.7శాతం ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది నివసిస్తున్నారని బీహార్ అదనపు ప్రధాన కార్యదర్శి వివేక్ కుమార్ సింగ్ తెలిపారు. కుల సర్వేకు అనుమతిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంకా విచారణ జరుపుతున్న సమయంలో బీహార్ కుల సర్వే జరిగింది.

బీహార్‌ అంతా ఒకే తాటిపైకి:

జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్వే బృందాన్ని అభినందించారు. 'అన్నీ చేశాక ఫలితం వచ్చింది. ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నాం... రేపు అఖిలపక్ష సమావేశాల్లో అన్నీ అందరి ముందు ఉంచుతాం... సమావేశంలో అందరి సలహాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది' అని కుమార్ పేర్కొన్నారు. జేడీయూ మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్ కూడా ఈ సర్వేను స్వాగతించింది. కుల సర్వే విషయంలో బీహార్‌ మొత్తం ఒకేతాటిపై ఉంది. కుల గణన రాజకీయ అంశంతో ముడి పడి ఉంది. ఓబీసీలు 63శాతం ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి మైనస్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీహార్‌లో కులగణనపై కాంగ్రెస్‌తో పాటు INDIA కూటమి పార్టీల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. బీహార్‌ కులగణనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. బీహార్‌లో జరిగిన కుల గణనలో ఓబీసీ+ ఎస్సీ+ ఎస్టీలు 84 శాతం ఉన్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వ 90 మంది కార్యదర్శుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీలు, వారు భారత బడ్జెట్లో కేవలం 3శాతం మాత్రమే నిర్వహిస్తున్నారు! అందువల్ల భారతదేశ కుల గణాంకాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనాభా ఎంత ఎక్కువైతే హక్కులు అంత ఎక్కువగా ఉంటాయి – ఇదీ మన ప్రతిజ్ఞ.’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు.



ALSO READ: మోదీకి ఝలక్‌.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?

#bihar-caste-census #modi-on-caste-census #caste-census
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe