/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nipah-1-jpg.webp)
Nipah Virus in West Bengal: ఇప్పటి వరకు కేరళ(Kerala) రాష్ట్రాన్ని వణికించిన నిపా వైరస్ (Nipah Virus) ..తాజాగా బెంగాల్ (Bengal) లో కలకలం రేపింది. కేరళ నుంచి కోల్కత్తా కు వెళ్లిన ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో వలస కూలీగా చేస్తున్న బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన జ్వరం, వికారం, గొంతు ఇన్ఫెక్షన్లతో హాస్పిటల్ కి వచ్చినట్లు ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.
ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి 20 సంవత్సరాల వయసు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ యువకుడికి నిపా వైరస్ కు సంబంధించిన అన్ని పరీక్షలను చేయాల్సి ఉందని వారు తెలిపారు. ఇప్పటికే అతనిని ఆసుపత్రిలో ప్రత్యేక విభాగంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ముందుగా కేరళలోని ఎర్నాకులంలో చికిత్స తీసుకున్నాడని తెలుస్తోంది.
అక్కడి నుంచి ఆ వ్యక్తి బెంగాల్ కి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చిన క్రమంలోనే మళ్లీ అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ముందు ఆ యువకుడిని నేషనల్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కి ఆ తరువాత బెలియాఘట ఐడీ హాస్పిటల్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
కేరళలో నిపా వైరస్ పై పోరాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాల్లో నిషేదం విధించింది. ఇతర రాష్ట్రాల వ్యక్తులకు అన్ని పరీక్షలు చేసిన తరువాతనే అనుమతిస్తున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం అక్కడ ఓపీడీ సేవను ప్రారంభించింది. ఇ-సంజీవని టెలిమెడిసిన్ సిస్టమ్ (eSanjeevani) పేరిట ప్రత్యేక ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవను అందుబాటులోనికి తీసుకుని వచ్చింది. ఈ సేవలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయని ఓ వైద్యాధికారిణి తెలిపారు.
Also Read: కాచిగూడ నుంచి మరో ‘వందేభారత్’ ట్రైన్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..