శరవేగంగా అయోధ్య పనులు
అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి కల్లా ఆ ఆలయంలోకి భక్తులను అనుమతించున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించనున్నారు.
కానుకల రూపంలో
కాగా, పలువురు భక్తులు రాముడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. డబ్బు, వస్తు రూపంలో కానుకలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా గుజరాత్లోని వడోదరా నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు.. 3403 కిలోల బరువున్న అగరబత్తిని తయారు చేసి శ్రీరాముడిపై తమ భక్తిని చాటుకున్నారు.
పంచద్రవ్యాలతో బాహుబలి అగరబత్తి
విహాభాయ్ భర్వాడ్ నేతృత్వంలో ఈ అగరబత్తిని పంచద్రవ్యాలతో తయారు చేశారు. దీని తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం పొడి, 280 కిలోల బార్లీ, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొబ్బరిపొడి, 425 కిలోల పూర్ణాహుతి సామగ్రి, 1,475 కిలోల ఆవుపేడను వాడారు. ఈ బాహుబలి అగరబత్తి తయారీకి రెండు నెలల సమయం పట్టినట్లు విహాభాయ్ భర్వాడ్ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలు ఖర్చైనట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ బాహుబలి అగరబత్తిని అయోధ్యకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు విహాభాయ్ తెలిపారు
[vuukle]