బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో దారుణం
టెన్త్ విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకులు
నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్
దాడిపై తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్తో పోలీసుల ఆరా
ఉప్పాలవారిపాలెంకు చెందిన అమర్నాథ్ 10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్స్ తిరిగి ప్రారంభించడంతో మూడు రోజుల నుండి ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున సైకిల్ వెళ్తున్న బాలుడిని రెడ్డిపాలెం వద్ద నలుగురు యువకులు అడ్డగించారు. రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాలెంలో ఈ ఘటనా చోటుచేసుకుంది. బాలుడిని కొట్టుకుంటూ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళారు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్ను కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
అయితే పెట్రోల్ పోసినా నలుగురు యువకుల్లో ఒకరిని బాలుడు గుర్తించాడు. రెడ్డిపాలెంకు చెందిన పాము వెంకటేశ్వరెడ్డి మరో ముగ్గురితో కలిసి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టనట్లు చెప్పాడు. గతంలో కూడా వెంకటేశ్వరరెడ్డి..అమర్నాథ్ను ఆటోలో తీసుకెళ్ళి కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్కు సైకిల్ అడ్డుపెట్టినందుకు అమర్నాథ్ను కొట్టినట్లు వెంకటేశ్వరెడ్డి చెప్పాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ పాత కక్షల నేపథ్యంలోనే ఈ రోజు అమర్నాథ్ను కొట్టి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు మృతుడు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.