నకిలి బిల్లులతో మోసం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్ఎఫ్లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సీఐడీ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి. అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి సీఐడీ రంగం సిద్ధం చేసింది. సీఎం సహాయ నిధి సీఎమ్ఆర్ఎఫ్ పథకంలో నకిలీ బిల్లులు బయటపడటంతో గతంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల పరిశీలనలో నకిలీ బిల్లులు బయటపడటంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది.
దరఖాస్తుల్లో నకిలీ పత్రాలు
దీంతో కేసును సీరియస్గా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం, మిర్యాలగూడలో నకిలీ బిల్లులు వెలుగులోకి రావడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోనూ నకిలీ పత్రాలున్నట్లు గుర్తించిన అధికారులు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్లో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి
ఈ స్కాంపై గత ఏప్రిల్లో సైఫాబాద్ పీఎస్లో కేసు నమోదుపై విచారణ చేపట్టారు. ఇందులో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసిన సీసీఎస్ నలుగురి అరెస్ట్ చేసింది. అయితే సీఎంఆర్ఎఫ్లో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి జరగడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. మిర్యాలగూడలో మొదట వెలుగు చూసిన స్కాంలో తప్పుడు బిల్లులు, నకిలీ రోగులను సృష్టించి సిఎం రిలీఫ్ ఫండ్ కొట్టేసే ప్రయత్నం చేశారు. నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో చికిత్స పొందినట్టు నకిలీ బిల్లులను తయారు చేశారు.
ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధుల పీఏలే కారణం
ఈ ముఠా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను వాళ్ల పీఏలు మంజూరు చేస్తూ ఉండడంతో అవినీతి జరగడానికి మార్గం సుగమం అయింది. అయితే బిల్లులపై అనుమానం రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్లో ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధుల పీఏలది కీలకళపాత్రగా ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ స్కాం ఒకటి, రెండు జిల్లాలకు పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.