ప్రియుడిని పెళ్లి చేసుకుంది..
ఇండియా నుంచి అంజు అనే మహిళ పాకిస్థాన్లోని నస్రుల్లా అనే ప్రియుడి కోసం పాక్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటిదాకా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ప్రియుడు నస్రుల్లాని వివాహం చేసుకోలేదని.. ఇండియాకి తిరిగొస్తున్నానని అంజు చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ముస్లింగా మతం మార్చుకుని మరి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా అక్కడే సెటిల్ అవ్వాలని కూడా ఫిక్స్ అయింది. ఆమె వివాహం నేపథ్యంలో పాక్ వ్యాపారవేత్త ఒకరు అంజుకి భారీ బహుమతులు కానుకగా ఇచ్చాడు.
అంజుకి భారీ బహుమతులు..
పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈవో మొహసీన్ ఖాన్ అబ్బాసి.. అంజుకి 50 వేల పాకిస్తానీ నగదు, 272 చదరపు అడుగుల స్థలంతో పాటు మరికొన్ని బహుమతులు అందజేశాడు. అంజు ఇస్లాం మతం స్వీకరించడంతో పాటు నస్రుల్లాని పెళ్లి చేసుకుంది కాబట్టి.. ఆమెను కోడలిగా స్వీకరిస్తున్నామని తెలిపాడు. తమ దేశంలో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని.. తాను సొంత దేశంలోనే ఉన్నాననే భావన కలిగించేందుకే ఈ కానుకలు ఇవ్వడం జరిగిందని వివరించాడు. పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు ఇతర వ్యాపారవేత్తలు, పాక్ ప్రజలు ఆమెకు మద్దతుగా నిలవాలని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమెకు ఇంతకుముందే పెళ్లి..
రాజస్థాన్కు చెందిన అంజుకి ఇంతకుముందే పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తతో కొన్నాళ్లు నుంచి విభేదాలున్నాయి. ఈ క్రమంలో అంజుకి ఫేస్బుక్లో నస్రుల్లా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అతడితో పెళ్లి కోసం పాకిస్తాన్కి వెళ్లడం జరిగింది. మరోవైపు తామిద్దరం విడాకులు తీసుకోలేదని అంజు ఇంకా తన భార్యేనని ఆమె భర్త అర్వింద్ కుమార్ చెబుతున్నాడు. తక్షణమే భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇటీవల చిత్తూరు జిల్లా అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్కు శ్రీలంకకు చెందిన యువతి శివకుమారి విఘ్నేశ్వరితో ఫేస్బుక్ ద్వారా 2017లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చింన ఆమెను లక్ష్మణ్ తన కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 20న వివాహం చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.