తక్కువ రేటుకే నెయ్యి సరఫరా.. అనుమానం వ్యక్తం చేసిన టీటీడీ ఈవో

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యత విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా.. జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు.

TTD EO Symala rao
New Update

హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ, జంతువుల కొవ్వు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. అందరూ భక్తితో భావించే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఈ లడ్డూల కల్తీ విషయంలో తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను ఈవోగా నియమితులైన సమయంలో లడ్డూ నాణ్యత మీద దృష్టి పెట్టమని సీఎం తెలిపారని శ్యామలరావు అన్నారు. అలాగే లడ్డూ నాణ్యత విషయంలో కూడా భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించకపోవడం వల్లే నాణ్యత లేదన్నారు. 

శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా..

చాలా తక్కువ రేటుకే నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చిందన్నారు. దీంతో వెంటనే నెయ్యి విషయంలో విచారణ జరపగా.. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈవో వెల్లడించారు. తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకు గత మార్చి నెల నుంచి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు చెప్పారు. వారు కిలో నెయ్యి రూ.320కి మే నెల నుంచి సరఫరా చేశారన్నారు. అయితే మొదటిగా నాలుగు నెయ్యి ట్యాంకులు పంపించారని తెలిపారు. వీటి నుంచి తీసిన నాలుగు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపింమన్నారు. దీంతో ఆ డెయిరీ ఫుడ్ పంపించిన నెయ్యిలో నాణ్యత లేదని తేలిందన్నారు. మొదటి టెస్ట్‌లో కూరగాయల ఫ్యాట్ ఉన్నట్లు తేలిందని.. రెండవ పరీక్షలో పంది మాంసం కొవ్వుతో పాటు ఇతర జంతువుల కొవ్వులు కూడా ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. 

వెంటనే నెయ్యి సరఫరా చేసేవాళ్లను బ్లాక్ చేసి, ఆ నెయ్యిని వెనక్కి పంపినట్లు ఈవో తెలిపారు. మొత్తం పది ట్యాంకర్లు రాగా.. ఆరు వాడి మిగతా నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామని ఈవో అన్నారు. అయితే కల్తీని గుర్తించే ల్యాబ్‌లు టీటీడీకి లేవన్నారు. గతంలో కూడా వీటిపై ఎవరు ప్రతిపాదన తీసుకురాలేదన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత 75 లక్షల విలువ అయిన కల్తీ ఆహార పరికరాలను NDDB సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2021 మే నుంచి లడ్డూ తయారీకి ఇలాంటి ఉత్పత్తులు వాడుతున్నట్లు చెప్పారు. అప్పటి నుంచే ప్రసాదాల నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో వాటి సరఫరా నిలిపివేశామని టీటీడీ ఈవో వెల్లడించారు. అయితే లడ్డూ నాణ్యత తగ్గినా కూడా.. డిమాండ్ మాత్రం తగ్గలేదని ఈవో మీడియాకి వివరించారు. ఈ నేపథ్యంలో అధునాతన ల్యాబ్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

#Tirumala Laddu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe