/rtv/media/media_files/2025/12/02/moeny-2025-12-02-20-27-57.jpg)
తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు రూ.8 లక్షలు నగదు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడింది. అయితే సంస్థలో డబ్బులు పెట్టిన వారిలో కొంత మందికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఏదీ చూపకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు.
గతంలో ఇదే సంస్థపై హైదరాబాద్లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)లో కేసు నమోదవడం గమనార్హం. రెండేళ్ల క్రితం హైదరాబాద్లోని కూకట్పల్లిలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ సంస్థ ఏర్పాటైంది. అధిక వడ్డీ, ప్రతిఫలం ఆశచూపడంతో సాధారణ వ్యక్తులతోపాటు కొందరు ఉద్యోగులు, అధికారులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది వద్ద నుంచి సుమారు రూ.330 కోట్ల వరకు ఈ సంస్థ సేకరించినట్టు బాధితులు చెబుతున్నారు.
గుంట భూమి చొప్పున రిజిస్ట్రేషన్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాగర్పల్లిలో ఉన్న భూములకు బై నంబర్లు వేసి వంద రూపాయల బాండ్ పేపరుపై గుంట భూమి చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా అగ్రిమెంట్లు ఇచ్చారని, కానీ అవి నకిలీవని తేలినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థ ఏజెంట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 300మందికిపైగా ఈ స్కీమ్లో చేర్పించి డబ్బులు కట్టించారు. వీరిలో కంపెనీ కొందరికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేసిన గుంట భూమిని చూపించకపోవటంతో జిల్లాలోని బాధితులు ఈ సంస్థకు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న రాపోలు ప్రకాశ్ ఇంటివద్ద ఇటీవలే ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రకాశ్ను టూటౌన్ పోలీ్సస్టేషన్కు తీసుకెళ్లారు. దీనితో బాధితులు పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఫిర్యాదు చేశారు.
Follow Us