పూర్తిగా చదవండి..
ఆన్లైన్ గేమ్ ఓ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపింది. తల్లి, ఇద్దరు పసిబిడ్డల చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని మల్లికార్జుననగర్లో జరిగింది. వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. తన భార్య రాజేశ్వరి, కుమారులు అనిరుధ్, హర్షవర్ధన్లతో కలిసి కొన్నేళ్లుగా చౌటుప్పల్లో నివాసం ఉంటున్నారు.
రాజేశ్వరి సంవత్సర కాలంగా ఆన్లైన్లో గేమ్ ఆడుతూ దాదాపు 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అయితే, డబ్బంతా తెలిసిన వ్యక్తులు, బంధువుల దగ్గర అప్పు తీసుకుంది. ఇక, తమ అప్పు తీర్చమని దగ్గరి బంధువు ఒకరు ఇంటికి వచ్చి నిలదీశారు. స్థలం విక్రయించి, బాకీ తీర్చుతామని నచ్చచెప్పినా ఆయన వినలేదు. దీంతో ఆమె భర్త మల్లేశ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే.. కొద్దిసేపటి తర్వాత అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో అవమానంతో రాజేశ్వరి తన ఇద్దరు కుమారులను ఇంటి ఆవరణలో ఉన్న నీటిసంపులో పడేసి, తానూ దూకేసింది.
రాత్రి 7 గంటల సమయంలో మల్లేశ్ ఇంటికి రాగా భార్యాపిల్లలు కనిపించలేదు. ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో అనుమానంతో అందులోకి తొంగి చూశారు. వెంటనే ముగ్గురినీ బయటికి తీసి చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినా అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
[vuukle]