వ్యక్తి లేదా సంస్థ ఎలాంటి అంతరాయం లేకుండా నియంత్రణ మండలి అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్ (ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్, వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్) పోర్టల్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు, దేశీయ ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) కంపెనీల కోసం ఫిన్టెక్ రిపాజిటరీని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విడుదల చేశారు. నియంత్రణ మండలి తన కోణం నుంచి ఫిన్ టెక్ రంగాన్ని మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడంతోపాటు ఈ రంగం కోసం సరైన విధానాలను రూపొందించేందుకు అవసరమైన సమాచార నిక్షిప్త వేదికగా ఈ రిపాజిటరీ పనిచేయనుంది.
రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు తమ స్మార్ట్ఫోన్ నుంచే ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలు నెరిపేందుకు వీలుంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు ఆప్ స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిటైల్ డైరెక్ట్ పథకంలో భాగంగా చిన్న మదుపరులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ను తెరిచేందుకు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ఇప్పటికే అందుబాటులో ఉంది. 2021 నవంబరులో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ ఆక్షన్స్తో పాటు సెకండరీ మార్కెట్ నుంచీ కొనుగోలు చేయవచ్చు.
పలు నియంత్రణ మండళ్లు, పర్యవేక్షక డిపార్ట్మెంట్ల అనుమతులకు సంబంధించిన 60 రకాల అప్లికేషన్లను ప్రవాహ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ పోర్టల్లో వ్యక్తి లేదా సంస్థ సమర్పించిన అప్లికేషన్ స్టేట్సను కూడా తెలుసుకునే వీలుంటుంది. మున్ముందు మరిన్ని దరఖాస్తు ఫారాలను ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.