ఊపిరిపీల్చుకున్న స్థానికులు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సబ్ జైల్ సమీపంలో మోటారు సైకిల్ మెకానిక్ షాప్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మోటారు సైకిల్ మెకానిక్ షాప్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు మొత్తానికి వ్యాపించడంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి . దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
పాక్షికంగా దెబ్బతిన్న రథం
అయితే ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సిబ్బంది, స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. మంటలు చెలరేగటం వల్ల పక్కనే వున్న రామాలయం రథంకు మంటలు తగిలి... పాక్షికంగా రథం దెబ్బతిదని పోలీసులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మూడు మోటారు సైకిళ్లు దగ్దం కాగా.. సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు.
జీవనోపాధి కోల్పోయిన వ్యాపారులు
నిన్న నంద్యాల పండ్ల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పండ్ల దుకాణాలలోని గడ్డి, చెక్కపెట్టెల వల్ల అగ్రికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారులు వెల్లడించారు. చిరువ్యాపారం చేసి జీవనం కొనసాగించే వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అగ్నిప్రమాదం వలన జీవనోపాధి కోల్పోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.
వరస ప్రమాదాలు
రెండు రోజుల క్రితం మంగలహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగబోలి వద్ద ఉన్న ఓ ఫర్నీచర్ షాప్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోదాం నుంచి మంటలు, పొగ రావడంతో స్థానికులు మంగలహాట్ పోలీస్లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనుమానస్పద అగ్నిప్రమాదం కేసు నమోదు చేసుకొని మంగలహాట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.