పేదలు, బలహీనవర్గాలే వారి టార్గెట్
సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కరపత్రాలు కలకలం రేపాయి. ఆ కరపత్రాల్లో అధికార పార్టీకి చెందిన ఓ నలుగురు ముఖ్య నేతల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, వారి వ్యక్తిగత భాగోతాలు వివరించబడ్డాయి. దుష్ట చతుష్టయం పేరిట వందల సంఖ్యల్లో కరపత్రాలు దర్శనమివ్వడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
దుష్టచతుష్టయం పేరిట
దుష్టచతుష్టయం పేరిట వైసీపీ కరపత్రాలు.. వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ కరపత్రాలు కలకలం రేపాయి. రాజంపేటలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేసిన ఘటన మరువకముందే.. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కడపలోని నలుగురు ముఖ్యమైన వైసీపీ నేతల భూ కబ్జాలపై కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకింగ్ వెళ్లే వారికి దుష్ట చతుష్టయం పేరిట వందల సంఖ్యలో కరపత్రాలు దర్శనమిచ్చాయి. అందులో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరులతో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబుల అక్రమ వ్యవహారాలు, వారి వ్యక్తిగత విషయాలు వివరించబడ్డాయి.
భూ కబ్జాల పేరుతో భారీ ఆస్తులు
భూ కబ్జాల పేరుతో భారీ ఆస్తులు.. కరపత్రాల్లో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరులతో పాటు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కడప నగర శివారులో భారీగా పేదలు, మధ్య తరగతి వారి ఆస్తులను సెటిల్మెంట్ల పేరుతో లాక్కొని.. ఈ నలుగురు నేతలు కోట్ల రూపాయలు సంపాదించారని తెలిపారు. ఈ భూ కబ్జాల వ్యవహారం కారణంగా ఈనెల 23న ఆర్టీసీ చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాసులురెడ్డిని దారుణంగా హత్య చేశారని వివరించారు. భూ దందాలు, సెటిల్మెంట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు కూడా తేల్చారు. ఈ క్రమంలో వీటిని ప్రోత్సహిస్తుందని.. ఈ నలుగురు నేతలే అన్న విధంగా కరపత్రాలు ముద్రించడం తాజా పరిస్థితికి అద్దం పడుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
భూ దందాలు, సెటిల్మెంట్లే ఎక్కువ
ఇది తక్కువ-వారి భాగోతం ఎక్కువ.. మరోవైపు ఈ కరపత్రాలపై కొందరు వైసీపీ నేతలు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇది చాలా తక్కువ అని, వారి భాగోతం ఇంకా ఎక్కువగానే ఉందని పేర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేదలు, బలహీనవర్గాల భూములను లిటిగేషన్ పేరుతో లాగేయడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల నేతలు, స్థానికులు అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం, ఏదో రకంగా టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయటం వల్ల చాలా మంది నాలుగేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కరపత్రాల రూపంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలను సొంత పార్టీ వాళ్లే బయటికి తీసుకురావడంపై సీఎం స్పందించి.. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కరపత్రాలు దర్శనమివ్వడం.. కడప వైసీపీలో ఒక్కసారిగా కాక రేగింది. ఎటు చూసినా ఈ వ్యవహారంపైనే చర్చ సాగుతోంది.
[vuukle]