Kerala: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

కేరళ లోని వయనాడ్ లోని ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసేందుకు పశ్చిమబెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వలస వస్తుంటారు.వీరిలో దాదాపు 600 మంది వలస కార్మికులు ముండకైలో నివాసం ఉంటున్నారు. నిన్నటి నుంచి వారి జాడ కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు.

New Update
Kerala: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌ లోని ముండకై ప్రాంతం మీద ప్రకృతి తన కోపాన్ని చూపించింది. భారీ కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు సుమారు 151 మంది మృతి చెందగా..ఇంకా ఎంతో మంది ఆ కొండచరియల కింద అనేక వందల మంది ప్రజలు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

కేరళ లోని వయనాడ్ లోని ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటలు విస్తారంగా ఉండడంతో ఈ తోటల్లో పని చేసేందుకు పశ్చిమబెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వలస వస్తుంటారు. వీరిలో దాదాపు 600 మంది వలస కార్మికులు స్థానిక హారిసన్ మళయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేయడానికి వచ్చారు. వీరంతా ముండకై లోనే ఉంటున్నారు.

ఇప్పుడు కొండచరియలు విరిగి పడిన విషాద సంఘటన తరువాత 600 మంది కూలీల జాడ తెలియక పోవడంతో అధికారులతోపాటు అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ వారి ఆచూకీ గురించి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం శూన్యం. మా కార్మికులు ఎవరినీ ఇప్పటివరకు సంప్రదించలేక పోయామని జోన్స్ వివరించారు.

మొబైల్ ఫోన్ లు కూడా పనిచేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు చాలావరకు మల్లప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నట్టు అక్కడి వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ప్రమాదస్థలానికి చాలా దూరంలో దాదాపు 11 మృతదేహాలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం లోకి ఐదు మృతదేహాలు కొట్టుకువచ్చాయని స్థానిక ఆదివాసీలు అధికారులకు సమాచారం అందించారు. ఎమ్‌ఎల్‌ఎ ఐసీ బాలకృష్ణన్ కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నాయని తెలిపారు. ముండకై గ్రామంలో పరిస్థితి భయానకంగా ఉందని కాల్పెట్టా ఎమ్‌ఎల్‌ఎ టి సిద్ధిఖీ తెలిపారు.

Also Read: అయోధ్య యాత్రలో విషాదం..సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు!

Advertisment
తాజా కథనాలు