Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఈ రూట్‌లో 6 ఫ్లై ఓవర్లు!

హైదరాబాద్ నగర వాహనదారులకు ప్రయాణం మరింత సులభం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసింది. జూబ్లీ చెక్‌పోస్ట్‌, రోడ్‌ నెంబర్‌– 45, ఎల్‌వీ ప్రసాద్‌, బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌, మహారాజా అగ్రసేన్‌, ఫిల్మ్‌నగర్‌ ప్రాంతాల్లో 6 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

New Update
Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఈ రూట్‌లో 6 ఫ్లై ఓవర్లు!

6 New Flyovers in Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. బంజారాహిల్స్, కేబీఆర్, మాదాపూర్, దుర్గంచెరువు మీదుగా ప్రయాణించే వారికి త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధి వరకు ట్రాఫిక్‌ చిక్కులు లేని సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం కోసం దాదాపు రూ.25 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. నగరంలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి ఎస్సార్‌డీపీలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన పనులను కాంగ్రెస్‌ సర్కారు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రూ.586 కోట్ల అంచనాతో 6 ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. ఈ పనులను ఐదు ఫేజ్‌ల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.

ఫ్లై ఓవర్లతో పాటు అండర్‌పాస్‌లు..
అయితే గత ప్రభుత్వంలో ఫేజ్‌–1లో భాగంగా కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ జంక్షన్, ఫిల్మ్‌నగర్‌ జంక్షన్, రోడ్‌ నెంబర్‌ 45 జంక్షన్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ – కేబీఆర్‌పార్కు ఎంట్రన్స్, రోడ్‌నెంబర్‌ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలనుకున్నారు. కానీ వీటిలో రోడ్‌నెంబర్‌ 45– దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ మాత్రమే పూర్తైంది. కేబీఆర్‌ పార్కు ఎకో సెన్సిటివ్‌ జోన్‌లో ఉండటం, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కావాల్సి ఉండటంతో పాటు పర్యావేరణ వేత్తల అభ్యంతరాలు రావడంతో మిగతా చోట్ల పనులు ఆగిపోయాయి. వీటిపై హైకోర్టులోనూ కేసులున్నట్లు సమాచారం. అయితే బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌ వద్ద ప్రతిపాదనలున్నప్పటికీ వాటిని రద్దు చేశారు. తిరిగి ఇప్పుడు మళ్లీ అక్కడ కూడా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఫ్లై ఓవర్లతో పాటు అండర్‌పాస్‌లు సైతం నిర్మించనున్నారు. కేబీఆర్‌ పార్కు అనేది నగరానికి హార్ట్‌లా ఉండటంతో పాటు సంపన్న వర్గాలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు, తదితర వీఐపీలు నిత్యం సంచరించే ప్రాంతం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ జంక్షన్‌పై దృష్టి సారించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులకు సైతం అభ్యంతరాలు ఉండవనే ధీమాతో ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Also Read: అన్ని జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సుందరీకరణ, తదితర ఆగిపోయిన పనులపై రేవంత్‌ రెడ్డి ప్ర్యతేక దృష్టిపెట్టారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ తదితర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మున్సిపల్‌ పరిపాలన శాఖ కూడా ఆయన వద్దే ఉండటంతో దిగువ ప్రాంతాల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు సంబంధించి కన్సల్టెంట్‌ సేవల్ని జీహెచ్‌ఎంసీ కోరుతోంది. త్రీడీ డిజైన్‌లో వాటిని అందజేయాల్సిందిగా సూచించింది.

ఆరు ఫ్లై ఓవర్లు ఈ ప్రాంతాల్లోనే..
1. జూబ్లీ చెక్‌పోస్ట్‌
2. రోడ్‌ నెంబర్‌– 45
3. ఎల్‌వీ ప్రసాద్‌
4. బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌
5.మహారాజా అగ్రసేన్‌
6. ఫిల్మ్‌నగర్‌

Advertisment
తాజా కథనాలు