Sharmila: ఇప్పటికే మూడు వారాలు.. మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా?.. కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్..!

వరద పీడిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలన్నారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్లు ఇచ్చిన బీజేపీ.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

New Update
Sharmila: ఇప్పటికే మూడు వారాలు.. మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా?.. కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్..!

YS Sharmila: APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి ఏపీ, కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.'ఇప్పటికే దాదాపు మూడు వారాలు, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు' అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారు.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది.. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది? అని షర్మిల ప్రశ్నించారు.

'బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసింది.. మరి ఏపీకి ఎందుకు ఇవ్వలేదు.. ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా..? మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత లేదు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇవన్నీ వదిలేసి, పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతూ, కనీసం ఎప్పుడు పర్యటిస్తారో కూడా చెప్పకపోవడం ప్రజల్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి రైతు ఎకరానికి రూ.15000 రూపాయలు ఖర్చుపెట్టాడు. అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా జరిగింది. మొత్తం నష్టం కలిపి సుమారు రూ.800 కోట్లు(అంచనా). అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

'మరి ఇంత భారీ ఎత్తున పంట నాశనం అయితే ఆదుకోవాల్సింది సర్కారే కాదా? మెడ లోతు నీళ్లలో మునిగి రైతన్న కష్టాన్ని మీకు వివరించాము. మా నిబద్ధతలో మీకు పావు వంతు ఉన్నా మీ సర్కారు ఈ నిర్లక్ష్యం చూపదు. కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వెంటనే వరద పీడిత ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి, రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలి' అని షర్మిల డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు