/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pm-jpg.webp)
PM Modi: ప్రధాని మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తన సత్తాను ఉపయోగించి ఇజ్రాయెల్ - గాజా సంక్షోభాన్ని వెంటనే ఆపాలని మోదీని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల సంభాషణకు సంబంధించి ఇరాన్ అధికారికంగా వివరాలను వెల్లడించింది. పశ్చిమ దేశాల అఘాయిత్యాలతో ఇండియా పడిన కష్టాలు.. ఆ తర్వాత అలీన ఉద్యమానికి భారత్ నాంది పలకడం వంటి వాటిని కూడా రైసీ ప్రస్తావించారు. తక్షణ సీజ్ ఫైర్ కోసం సంయుక్తంగా చేపట్టే ఏ గ్లోబల్ కార్యక్రమానికైనా ఇరాన్ మద్దతుగా ఉంటుందని రైసీ చెప్పారు.
Also Read: వారిని ఖచ్చితంగా జైల్లో వేస్తాం.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..
గాజాలో పాలస్తీనీయులను దారుణంగా చంపుతున్నారని, అమాయక మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మసీదులు, చర్చిలు, నివాస స్థలాలపై ఇజ్రాయెల్ బాంబులు కురిపిస్తోందని వాపోయారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. తమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని అడ్డుకునే హక్కు పాలస్తీనియన్లకు ఉంటుందని రైసీ చెప్పారు.
నాజీ జర్మనీకి వ్యతిరేకంగా గతంలో యూరోపియన్ దేశాలన్నీ ఒక్కటి కావడం చారిత్రాత్మకమని, ఒక హీరోయిక్ యాక్ట్ అని కొనియాడారు. ఇదే సమయంలో గాజాలో జరుగుతున్న నరమేధాన్ని ఎందుకు ఇతర దేశాలు ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇండియా కీలక పాత్రను పోషించాలని కోరారు. భారత్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రైసీ చెప్పారు. పరస్పర సహకారంతో, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. తమ దేశంలోని చబాహర్ పోర్టుతో పాటు పలు రంగాల్లో భారత్ భారీ పెట్టుబడులు పెట్టాలని కోరారు.