ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే. రుషికొండను విధ్వంసం చేసి గత ప్రభుత్వం రహస్యంగా రాజమహల్ నిర్మించిందని ఆయన ఆరోపించారు. అత్యంత గోప్యంగా నిర్మాణాలు ఎందుకో అర్థం కాలేదన్నారు. రూ.500కోట్లతో రుషికొండలో నిర్మాణాలు చేశారన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని.. ఆ సమయంలోనే రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కామెంట్స్ పై వైసీపీ స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విట్టర్ (X) ఖాతా నుంచి ప్రకటన విడుదలైంది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేని వైసీపీ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి అని.. అవేవీ ప్రైవేటు ఆస్తులు కావని స్పష్టం చేసింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించిందని వైసీపీ తెలిపింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమని వెల్లడించింది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని ట్విట్టర్ లో పేర్కొంది. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడని ఆ పార్టీ తెలిపింది.
విశాఖకు ఒక ప్రధాని వచ్చినా.. ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలంది. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని వైసీపీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.