ఓ కన్నతల్లి తన కడుపున పుట్టిన పాపానికి తన సొంత పిల్లలను అత్యంత కర్కశంగా చంపేసింది. తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్ పైనుంచి తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్పేటలో చోటు చేసుకుంది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ 8వ అంతస్తు పైనుంచి తన కూతురు, కొడుకును కిందకు తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సౌందర్య, ఆమె పిల్లలు నిత్య, నిదరీష్గా పోలీసులు గుర్తించారు.
అయితే కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త తనని వేధింపులకు గురిచేయడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో సౌందర్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె భర్త, అత్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు. భార్య, భర్తలన్నాక.. గొడవలు సహజం, అంతమాత్రానికి బిడ్డలను చంపుకునేంత నేరం ఆ పసిపిల్లలు ఏం చేశారని ఘటన తెలుసుకున్న నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భార్య, భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా సరే పెద్దమనుషుల మధ్య పరిష్కరించుకోవాలే కానీ తనువు చాలించొద్దని చెబుతున్నారు.