/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rahul-gandhi-2.jpg)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నెక్ట్స్ స్టెప్ ఏంటి..? గుజరాత్ కోర్టు తీర్పు తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయనున్నారా..? రాహుల్ గాంధీ ఇక ఎన్నికల్లో పోటి చేయలేరా..? ఇప్పుడివే ప్రశ్నలు హస్తం కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల సంబంధిత కేసులో గుజరాత్ హైకోర్టు నుంచి రాహుల్కు చుక్కెదురవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటన్నదానిపై కాంగ్రెస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సూరత్ సెషన్స్కోర్టు తనను దోషిగా ఖరారు చేయడాన్ని నిలిపివేయాలనే ఆయన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఇక్కడైనా తనకు ఊరట కలుగుతుందని భావించిన రాహుల్కి నిరాశే ఎదురైంది. గుజరాత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ ఏం చేయబోతున్నారు..?
ఆ ఒక్క ఆప్షనే మిగిలింది:
అనర్హత వేటుపై గుజరాత్ హైకోర్టు రూలింగ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు కూడా నిర్థారించాయి. ఆయనకు చట్టపరంగా పలు మార్గాలు ఉన్నాయని, దోషిత్వ ఖరారు వీగిపొయ్యేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేత , లాయర్ అభిషేక్ సింఘ్వీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై తమ న్యాయపోరు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు రాహుల్ కేసు బంతి సుప్రీంకోర్టులో పడనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rahul-gandhi-2.jpg)
ప్రజాప్రాతినిధ్య చట్టం:
ఒకవేళ సుప్రీంకోర్టు కూడా గుజరాత్ కోర్టు తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ రాజకీయ జీవితానికి చాలా కాలం బ్రేకులు పడే అవకాశాలున్నాయి. 2024,2029పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ పోటి చేసే ఛాన్స్ ఉండదు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎంపీ లేదా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన ప్రజాప్రతినిధి సభ్యత్వాన్నిరద్దు చేసే నిబంధన ఈ చట్టంలో ఉంది. రాహుల్ గాంధీని ఈ చట్టం ప్రకారమే అనర్హుడిగా ప్రకటించారు. సెక్షన్ 8(3) ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడి, రెండు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించిన వ్యక్తికి నేరారోపణ తేదీ నుంచి అనర్హులు అవుతారు . జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మరో ఆరు సంవత్సరాల పాటు అనర్హుడిగా కొనసాగాలి. ఇదే జరిగితే రానున్న ఎన్నికలతో పాటు 2029సార్వత్రిక ఎన్నికల్లోనూ రాహుల్ పోటి చేసే వీలుండదు..! ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు రాహుల్కి అనుకూలంగా వస్తే మాత్రం ఆయన పోటికి దిగే ఛాన్స్ ఉంటుంది. జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ ఇండియావైడ్గా పెరిగిందన్న విశ్లేషణల సమయంలో ఈ కేసు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
అసలేం జరిగిందంటే..?
2019లో ఎన్నికల ప్రచార దశలో రాహుల్ తమ ప్రసంగంలో మోదీ ఇంటిపేరును తీసుకుని పరుషపదజాలం వాడారనే అభియోగాలు ఉన్నాయి. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..అక్కడి ప్రజలను రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తం చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ .. సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ తన వాదనను వినిపించారు. అయితే పూర్తిస్థాయి విచారణ తర్వాత కోర్టు.... 2023 మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.