గల్లీ క్రికెట్లో తరుచుగా జరిగే ఘటన ఒకటి ఉంటుంది. లైట్ ఫెయిల్యూర్ అవుతున్న సమయంలో బౌలింగ్ చేస్తున్న టీమ్ కావాలని టైమ్ వేస్ట్ చేస్తుంటుంది. పదేపదే వైడ్లు వేయడం.. కీపర్ కావాలని బాల్ వదిలేయడం.. ఎలాగో బైస్ రూల్ ఉండదు కదా.. అందుకే ఫీల్డర్ కూడా ఆ బంతి తీసుకురావడానికి చాలా టైమ్ తింటాడు. అక్కడ నుంచి బాల్ థ్రో చేయడం.. ఇదంతా సమయం వృధా చేసే టెక్నిక్స్.. ఇదే ఘటన ఓ కాంపిటేటివ్ క్రికెట్లో జరిగితే ఎలా ఉంటుంది.. ఎంత చీప్గా ఉంటుంది..? కానీ అదే జరిగిదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. దులీప్ ట్రోఫి ఈ ఘటనకు వేదికైంది.
33బంతులు వేయడానికి 53నిమిషాలా..?
సాధారణంగా 6ఓవర్లు వేయడానికి 24నిమిషాలు పడుతుంది.. ఏదైనా లేట్ అయితే 28నిమిషాలు పడుతుంది. కానీ కేవలం 5.3ఓవర్లు బౌలింగ్ వేయడానికి ఓ టీమ్ ఏకంగా 53నిమిషాలు తీసుకుందంటే నమ్మగలరా..? దులీప్ ట్రోఫిలో నార్త్ జోన్- సౌత్ జోన్ మధ్య జరిగిన ఈ ఘటన క్రికెట్ సర్కిల్స్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దులీప్ ట్రోఫి సెమీస్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నార్త్ జోన్ సౌత్ జోన్ ముంగిట 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత టార్గెట్ ఛేజ్ చేయడానికి బరిలోకి దిగిన సౌత్ జోన్కి మధ్యలో వర్షం బ్రేక్ ఇచ్చింది. వాన పడే సమయానికి సౌత్జోన్ 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కాసేపటి తర్వాత వాన ఆగిపోయింది.
ఇది నిజంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే అంటున్న ఫ్యాన్స్:
వర్షం ఆగిపోయిన తర్వాత కాసేపటికి మ్యాచ్ మొదలైంది. అప్పటినుంచి నార్త్ జోన్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిగా విరుద్దంగా ప్రవర్తించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్ బాల్కి ఎవరైనా ఫీల్డింగ్ మార్చుతారా..? కానీ నార్త్ జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ అదే చేశాడు. ప్రతి బంతికి ఫీల్డింగ్ మార్చాడు. అంతటితో ఆగలేదు. ప్రతిసారి బౌలర్ దగ్గరకు వెళ్లడం డిస్కషన్ పెట్టడం చేశాడు. ఇదంతా కావాలని చేసినట్టు మ్యాచ్ చూసిన వాళ్లు ఫైర్ అవుతున్నారు.
ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?
దులీప్ ట్రోఫి నాకౌట్ స్టేజీలో ఓ రూల్ ఉంటుంది. ఒక వేళ మ్యాచ్ డ్రా అయినా.. వర్షం కారణంగా ఆగిపోయినా.. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సంపాదించిన టీమ్నే విన్నర్గా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్లో సౌత్ జోన్ ఈజీగా గెలిచేలా కనిపించిన సమయంలో టైమ్ని వృధా చేసేందుకు నార్త్ జోన్ ఆటగాళ్లు ప్రయత్నించారు. మరోసారి వర్షం పడే ఛాన్స్ ఉండడంతో ఇలా చేసినట్టు తెలుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో నార్త్ జోన్కి మూడు పరుగుల లీడ్ ఉంది. అందుకే మ్యాచ్ డ్రా అవ్వాలని జయంత్ యాదవ్ క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా గేమ్ ఆడాడన్న విమర్శల దాడి పెరిగింది. అయితే నార్త్ జోన్ కన్నింగ్ బుద్ధి సౌత్ జోన్ విక్టరీని ఆపలేకపోయింది. 36.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.