పైలట్ అప్రమత్తం కావడంతో..
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాలు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో అవి రెండు ఒకే రన్వేపై రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఇది చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కానీ పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా తీవ్ర ప్రాణనష్టం సంభవించేది. ఆ సమయంలో ఇరు విమానాల్లో కలిపి 300 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానాల్లో 300 మంది ప్రయాణికులు..
అహ్మదాబాద్ నుండి ఢిల్లీ వస్తున్న విస్తారా విమానం ల్యాండింగ్ కోసం రాగా.. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోని బాగ్దోరాకు వెళ్లే విమానానికి టేకాఫ్ అయ్యేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి వచ్చింది. అయితే అహ్మదాబాద్-ఢిల్లీ విమానం పైలట్ అప్రమత్తమైన పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారుల సూచనలతో బాగ్దోరా వెళ్లే విమానం ఆగిపోగా.. అహ్మదాబాద్ నుంచి విమానం ల్యాండ్ అయింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే 300 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, ఇతర సిబ్బంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి.
1800మీటర్ల దూరంలోనే..
ప్రమాదం జరగబోయే సమయంలో రెండు విమానాలు 1800 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. పైలట్ ఏటీసీ అధికారులను హెచ్చరించి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది. విస్తారా ఫ్లైట్ VTI926 రన్వే 29Lలో దిగడంతో పార్కింగ్ బేకు వెళ్లే మార్గంలో రన్వే 29Rని దాటమని ఓ అధికారి తెలిపారు. అయితే అదే సమయంలో మరో విమానానం VTI725కి ఇచ్చిన టేకాఫ్ సూచనలను మర్చిపోయారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.