రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రబీ పంట సీజన్లో (2023 అక్టోబర్ 1 - 2024 మార్చి 31) నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి తదితర ఎరువుల కోసం.. పోషక ఆధారిత సబ్సిడీ రేట్లను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. ఎరువులపై సబ్సిడీ కోసం దాదాపు రూ.22,303 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒక కేజీ నైట్రోజన్కు రూ.47 రూపాయలు, ఒక కేజీ పాస్పరస్కు రూ.20.82, ఒక కేజీ పోటాషియంకు రూ.2.38, అలాగే ఒక కేజీ సల్ఫర్ రూ.1.89లకు కేంద్రం సబ్సిడీ ఇవ్వనుంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎరువుల రేట్లు పెరిగినా కూడా రైతులపై భారం పడనివ్వకుండా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) ఒక టన్నుకు రూ.4500ల సబ్సిడీ కొనసాగనుంది. ఇక రైతులు పాత రేటు ప్రకారమే ఒక డీఏపీ బస్తాకు రూ.1350 చెల్లించవచ్చు. అలాగే ఎన్పీకే (నెట్రోజన్,పాస్పరస్, పోటాషియం) వంటి ఎరువుల కోసం ఒక బస్తాకు రూ.1470 చెల్లించవచ్చు. ఈ మేరకు ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరాలను వెల్లడించారు.