క్లారిటీ ఇచ్చేసిన తుమ్మల..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. గోదావరి జలాలు పాలేరుకు తెచ్చేందుకే ఇక్కడి నుంచి పోటీచేస్తానని తెలిపారు. అది తన రాజకీయ లక్ష్యమని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట కూడా అదేనని వ్యాఖ్యానించారు. తాత్కాలిక కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరగదని.. శాశ్వతంగా మేలు జరగాలని పేర్కొన్నారు. పాలేరులో పోటీ చేసే అవకాశం గతంలో కల్పించారని.. అందుకు తగ్గట్లుగా అభివృద్ధి చేశానన్నారు. పాత కాలువకు లైనింగ్ చేయించా... మోటపూరంలో నాలుగు లిఫ్టులు ప్రారంభించా.. అందుకే భక్త రామదాసు పథకం తెచ్చానని చెప్పారు. గతంలో తుమ్మలను గెలిపించలేకపోయామని అన్ని పార్టీల మద్దతుదారులు మనస్థాపం చెందుతున్నారని వెల్లడించారు.
గులాబీ బాస్ వ్యుహాలు..
గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల.. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో కందాల బీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు. దీంతో తుమ్మల, కందాల మధ్య టికెట్ కోసం పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ వ్యుహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉంది. అందుకే పొంగులేటి చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పొంగులేటి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జలగం వెంకట్రావు, వనమా వెంకటేశ్వరరావు మధ్య అనర్హత వివాదం కొనసాగుతోంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
ఈ నేపథ్యలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. కొత్తగూడెం నుంచి తుమ్మలను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తుమ్మల పోటీ చేస్తే ఇటు జలగం, వనమా సమస్య పరిష్కారంతో పాటు పొంగులేటికి చెక్ పెట్టవొచ్చనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు వైసీటీపీ అధినేత్రి షర్మిల సైతం పాలేరులోనే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే అక్కడ ఆమె పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో షర్మిల పోటీ చేస్తే బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదనే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తుమ్మలను కొత్తగూడెం బరిలో ఎలాగైనా నింపనున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో తుమ్మల నాగేశ్వరరావు మాత్రం పాలేరు నుంచే పోటీచేస్తానని స్పష్టంచేయడంతో జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.