TSRTC Dussehra Offer: దసరాకు ఆర్టీసీ బస్సులో ఊరెళ్లండి.. రూ.9900 గెలుచుకోండి.. బంపరాఫర్!

New Update
TSRTC Dussehra Offer: దసరాకు ఆర్టీసీ బస్సులో ఊరెళ్లండి.. రూ.9900 గెలుచుకోండి.. బంపరాఫర్!

దసరా (Dussehra 2023) పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). ఈ పండుగ సీజన్లో ప్రయాణించిన వారికి భారీగా బహుమతులు అందించనున్నట్లు ప్రకటించింది. బహుమతులు గెలుచుకోవడానికి ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల ప్రయాణికులు తమ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ను రాసి ఆయా బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాలని సూచించింది ఆర్టీసీ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రతీ రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు వివరించింది ఆర్టీసీ. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.

ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాల్సి ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ఉండే ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 మంది విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందించనుంది ఆర్టీసీ.

సెప్టెంబర్ 31 న రాఖీ పండుగ సందర్భంగా కూడా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించింది. ఈ లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ.5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి ఘనంగా సంస్థ సత్కరించింది. రాఖీ పౌర్ణమి స్ఫూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సూచించారు. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు