Ration Rice: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు: మంత్రి ఉత్తమ్ వార్నింగ్

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే ఊరుకునేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు హుజూర్ నగర్ లోని రేషన్ దుకాణంలో మంత్రి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Ration Rice: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు: మంత్రి ఉత్తమ్ వార్నింగ్
New Update

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం హుజూర్‌ నగర్‌లోని రేషన్ దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. బియ్యం, ఇతర సేవల నాణ్యతను పరిశీలించారు. డీలర్ ను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని దాదాపు 54 లక్షల మంది రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కిలోల బియ్యం అందుతుందన్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి అస్వస్థత అంటూ వార్తలు.. ఖండించిన సీఎంవో

అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 35 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ప్రతీ నెలా 6 కిలోల బియ్యాన్ని అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ల నుండి మొత్తం సేకరణ ఖర్చు కిలోకు రూ. 39 అని అన్నారు. అయితే, దాదాపు 70-75% రేషన్ బియ్యాన్ని మిల్లర్లు మరియు ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుందన్నారు. బియ్యం రీసైక్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఉత్తమ్.

రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు లేదా ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు రూ.56,000 కోట్ల అప్పుల భారం మోపిందన్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పు రూ.3300 కోట్లు మాత్రమేనన్నారు. ప్రస్తుతం రేషన్ పంపిణీ, వరి ధాన్యం సేకరణ బాధ్యత కలిగిన కార్పొరేషన్ వార్షిక వడ్డీ భారం రూ.3,000 కోట్లు దాటిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఈ శాఖ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో దశాబ్ధ కాలంగా కార్పొరేషన్‌కు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

#uttam-kumar-reddy #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe