తెలంగాణ రైతులకు తీపి కబురు.. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి రూ.5809.78 కోట్లు బ్యాంకులకు జమ అయ్యాయి.

తెలంగాణ రైతులకు తీపి కబురు.. రూ.లక్ష లోపు రుణాలు మాఫీ
New Update

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినట్లు సర్కార్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.99,999 లోపు ఉన్న రుణాలను బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. దీంతో రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 9లక్షల 2వేల 843 మంది రైతులకు సంబంధించి రూ.5809.78 కోట్లు బ్యాంకులకు జమ అయ్యాయి.

2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. "అయితే అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌ డౌన్‌ విధించడంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికే రూ.50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించడం జరిగింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చింది. తాజాగా 99వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణమాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది." అని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 2వ తేదీన సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కేసీఆర్ ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ రిలీజింగ్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చారు. దీంతో ఆ రోజు నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలైంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16లక్షల 66వేల 899 మంది రైతులకు లబ్ది చేకూరినట్లైంది. ఇప్పటివరకు రుణమాఫీకి రూ.7,753 కోట్లను మాఫీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe