తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తమ విజయాన్ని అమరవీరుల ఆకాంక్షలను అమలు చేయడానికి వినియోగిస్తామన్నారు. తెలంగాణలో పేదలను ఆదుకోవడానికి.. మానవ హక్కులను పునరుద్ధరించడానికి తమ గెలుపును ఉపయోగించుకుంటామన్నారు. సామాన్యుల కోసం సచివాలయాన్ని తెరిచి ఉంచుతామన్నారు. ప్రగతి భవన్ పేరు మారుస్తామన్నారు. ప్రగతి భవన్ పేరును డా.అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామన్నారు. పార్టీ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇచ్చిన మద్దతుతో ఇక్కడ ప్రభుత్వంపై పోరాటం చేశామన్నారు.
ఇది కూడా చదవండి: Election Counting 🔴 Live: తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
కన్యాకుమారీ నుంచి కశ్మీర్ వరకు చేపట్టి తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్రతో రాహుల్ తమలో స్ఫూర్తిని నింపారన్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని నింపారన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. పార్టీ పెద్దలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి, వీ హనుమంతరావు, మధు యాష్కి సహకారంతో విజయం సాధించామన్నారు.
శ్రీకాంతాచారి ఇదే రోజు డిసెంబర్ 3న అమరుడు అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు తమ తీర్పు ద్వారా శ్రీకాంతాచారికి నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుని పోతామన్నారు.