ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ఆయన ఆ పార్టీలోకి చేరుతారు. ఈ పార్టీలో చేరబోతున్నారు అంటూ రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా.. బీఆర్ఎస్ నుంచి ఉత్తమ్కు ఆఫర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. త్వరలో గులాబీ కండువా కప్పుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. భార్య పద్మావతితో కలిసి బీఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రచారం జరగడంతో ఉత్తమ్ రియాక్ట్ అయ్యారు. పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు ఉత్తమ్. ‘నేను కాంగ్రెస్ను వీడుతున్నాను అనడం దుష్ప్రచారం.
అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళతాను’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. మరోవైపు ఉత్తమ్ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఖండిచారు. ఉత్తమ్ కరుడుకట్టిన కాంగ్రెస్వాది అన్నారు భట్టి. కాగా.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి తదితరులు త్వరలోనే హస్తం పార్టీలో చేరనున్నారు. ఈక్రమంలో ఆరోజే ఉత్తమ్ కూడా తన భార్యతో కలిసి బీఆర్ ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారంపైనే ఘాటుగా రియాక్టయ్యారు ఉత్తమ్.