Revanth Reddy: బూచోడు వస్తున్నాడు.. భూములన్నీ దోచేస్తాడు: కామారెడ్డిలో రేవంత్ పంచ్ లే పంచులు

కేసీఆర్ ను గెలిపిస్తే కామారెడ్డిలోని భూములను దోచేస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ ను అభివృద్ధి చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను ఓడించాలని కామారెడ్డి ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.

Telangana Elections 2023: ఫామ్‌ హౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని నల్గొండకు నీళ్లు ఎందుకియ్యలే కేసీఆర్: రేవంత్
New Update

దేశ ప్రజలంతా కామారెడ్డి ప్రజలు ఇవ్వబోయే తీర్పుకోసం ఎదురు చూస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ రోజు కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం, అహంకారం, దోపిడితో పది ఏళ్లుగా తెలంగాణను చెరబట్టిన కేసీఆర్ కు (CM KCR) చరమగీతం పాడడానికి కామారెడ్డి (Kamareddy) ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2015లో ఈ ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య సచివాలయం ఎదురుగా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాల కారణంగానే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాని కేసీఆర్ కు.. ఇప్పుడు కోనాపూర్, కామారెడ్డి గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు. గజ్వేల్ ను ఏం చేశావ్? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. అక్కడ ప్రాజెక్టులను నిర్మించి బంధువుల భూములను కాపాడి.. పేద రైతుల భూములను ముంచాడని ధ్వజమెత్తారు. అక్కడ అభివృద్ధి చేస్తే ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పాలన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్మాలా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Patel Ramesh Reddy: సూర్యాపేటలో నేను ఎందుకు గెలుస్తానంటే: పటేల్ రమేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ కుట్రతో కేసీఆర్ ఇక్కడికి వచ్చాడని ధ్వజమెత్తారు. ఓట్ల అవసరంతోనే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను కేసీఆర్ రద్దు చేశారని ఆరోపించారు. గంపా గోవర్దన్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ సీటును కేసీఆర్ గుంజుకున్నాడన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాతపెడతారన్నారు. కేసీఆర్ పదేళ్లలో రూ.లక్ష కోట్లు, హైదరాబాద్ లో పది వేల ఎకరాలు, గజ్వేల్ లో వేయి ఎకరాలు దోచుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ కారణంగా మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని నిప్పులు చెరిగారు.

కేసీఆర్ పరీక్షలను నిర్వహించలేకపోయాడని, మహిళలను కాపాడలేకపోయాడని, రాష్ట్రాన్ని ఆగం చేశాడని ఆరోపించారు. మనవడిని మంత్రిని చేయడానికే కేసీఆర్ తనను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడిందా? అని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ జరగలేదని, పండించే పంట కొనే దిక్కులేదన్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో హైకమాండ్ ఆదేశాలతో ఇక్కడ నామినేషన్ వేశానన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో అధికారం కోసం ఏనాడూ అమ్ముడు పోలేదని.. కాంట్రాక్ట్ ల కోసం కక్కుర్తి పడలేదన్నారు.

అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. ప్రజా తీర్పును కేసీఆర్ తుంగలో తొక్కాడన్నారు. రాష్ట్రాన్ని కొనుగోలు కేంద్రంగా మార్చాడన్నారు. అమ్ముడుబోయే సరుకుగా తెలంగాణ రాజకీయాలను మార్చింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యేలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. కేసీఆర్ అనే బూచోడు కామారెడ్డికి వస్తున్నాడు.. భూములు కొల్లగొడతాడన్నారు. మీకు అండగా నిలబడతా.. మీ పేరు నిలబెడతానని కామారెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు. కామారెడ్డి ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

#telangana-elections-2023 #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe