ఎస్వీ గోసంరక్షణశాలలోని మేలుజాతి ఆవుల నుంచి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారు. అనంతరం వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టారు. దీంతో శనివారం (జూన్24) రాత్రి ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప, దీప నైవేద్యాలకు నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుంచి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆవులు ఆరోగ్యపరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీకి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు.
గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుంచి 4 వేల లీటర్ల ఆవుపాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు.రోజుకు 60 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం,నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయడం జరుగుతుందని ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పద్మనాభరెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా పిండ మార్పిడి చేయబడిన ఆవులలో ఇప్పటి వరకు 11 గోవులు గర్భం దాల్చినట్లు తెలిపారు. ఒక ఆవు శనివారం (జూన్ 24) రాత్రి సాహివాల్ పెయ్య దూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 సాహివాల్ దూడలు జన్మించనున్నాయని తెలియజేశారు. ఇదే కాకుండా లింగ నిర్ధారిత వీర్యాన్ని ఎస్వీ గోశాలలో ఉన్న సాహివాల్, గిర్ గోవులలో కృత్రిమ గర్భధారణ ద్వారా ప్రవేశపెడతామన్నారు .